‘పార్కింగ్ ప్లేస్’ గా మారిన నేషనల్ హైవే
ఇబ్బందులు పడుతున్న స్థానికులు
✍️ దివిటీ మీడియా
నిత్యం వందలాది వాహనాలు తిరిగే ఆ జాతీయ రహదారి ‘లారీలకు పార్కింగ్ ప్లేస్’గా మారడంతో స్థానికులతోపాటు ఆ మార్గంలో ప్రయాణించే వాహనాల వారు ఇబ్బందులు పడుతున్నారు. అంతర్రాష్ట్ర రవాణా వాహనాలు అత్యధికంగా తిరిగే జాతీయ రహదారి మీద అనధికారికంగా నిలిపి ఉంచిన లారీల వల్ల ప్రమాదాలు జరుగుతున్న దుస్థితి నెలకొందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు… ఈ పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలోనిది. పట్టణంలోని కూనవరం రోడ్డులో ‘ఐటీసీ టీచర్స్, స్టాఫ్ కాలనీ’ ప్రాంతంలో లారీలు జాతీయ రహదారిపైనే వరుసగా నిలిపి ఉంచడం నిత్యకృత్యమైంది. దీనివల్ల ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు, కాలనీ వీధుల్లో (సందులలో) నుంచి బయటకు వాహనాలపై వచ్చేందుకు లారీలు అడ్డం ఉంటున్నాయని వాపోతున్నారు. అడ్డం ఉంటున్న లారీల చాటు నుంచి ప్రధాన రహదారి పైకి వచ్చే సమయంలో అటు వైపు వెళ్లే వాహనాలు కనిపించకుండా ఢీ కొట్టిన ఘటనలు చోటు చేసుకుంటున్న పరిస్థితులున్నాయి. దీనికితోడు జాతీయ రహదారిపై వేగంగా వెళ్లే వాహనాలకు కూడా ఇబ్బందులేర్పడుతున్నాయి. ఆ ప్రాంతంలో రోడ్డుపై నిలిపి లారీల చాటు నుంచి చిన్నారులు సైకిళ్లపై అకస్మాత్తుగా రోడ్డుపైకి వస్తూ ప్రమాదాల బారిన పడు తున్న దుస్థితి నెలకొంది. అసలు ఎక్కడ రహదారిపైనైనా వాహనాలు ‘పార్కింగ్’ నిబంధనలకు విరుద్ధం, ప్రమాదకరం కూడా. ఈ పరిస్థితుల్లో భద్రాచలంలోని కూనవరం రోడ్డుతోపాటు పలుప్రాంతాల్లో ఇలాంటి ‘పార్కింగ్’ చేయకుండా స్థానిక పోలీసులు, రవాణాశాఖాధికారులు తగు చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలను నివారించాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు.

