దామరతోగులో పోలీసుల కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్

ఆదివాసీలకు దోమతెరలు పంపిణీ చేసిన గుండాల పోలీసులు

✍️ గుండాల – దివిటీ (జూన్ 18)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు బుధవారం గుండాల మండలంలోని దామెరతోగు గ్రామం నేతకాని గుంపులో పోలీసులు కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ(ఆపరేషన్స్) జి.నరేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివాసీ ప్రజలు మావోయిస్టులకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించవద్దని కోరారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తూ అభివృద్ధి దిశగా పయనించాలన్నారు. అభివృద్ధిని అడ్డుకునే మావోయిస్టులకు సహకరించవద్దని, మావోయిస్టులవి కాలం చెల్లిన సిద్ధాంతాలని తెలిపారు. ఇల్లందు డీఎస్పీ చంద్రభాను మాట్లాడుతూ, యువత, పిల్లలు విద్య ద్వారానే ఉన్నతస్థానాలకు చేరుకుంటారని తెలిపారు.అసాంఘిక శక్తులకు సహకరించి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ అనవసరంగా కేసులు, జైలు పాలు కావద్దని ఆయన సూచించారు. వర్షాకాలంలో తమ ఇళ్ల చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అధికంగా మురుగు నీరు చేరడం వల్ల దోమలు అధికమై డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాల బారిన పడే అవకాశం ఉందని అధికారులు సూచించారు. అనంతరం అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్, డీఎస్పీ చంద్రబాను చేతుల మీదుగా అక్కడ నివసించే ప్రజలకు 50 దోమతెరలు పంపిణీ చేశారు. పిల్లలకు నోట్ బుక్స్, పెన్నులు పంచారు. మొబైల్ నెట్వర్క్ సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. దోమతెరల పంపిణీకి సహకరించిన ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ మెంబర్ పాషాను అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గుండాల సీఐ రవీందర్, ఎస్సై రవూఫ్, పోలీసు సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.