‘భూసమస్యలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయం’
‘భూభారతి’పై అవగాహన కల్పించిన జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్

✍️ గుండాల, భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఏప్రిల్ 17)
రాష్ట్రంలో భూసమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతిని ప్రారంభించిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి. పాటిల్ అన్నారు. గుండాల మండలం ఆళ్లపల్లి గ్రామ రైతువేదికలో ‘భూభారతి’ చట్టం -2025 అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూముల విషయంలో ఎలాంటి సమస్యలు ఏర్పడిన సంవత్సర కాలంలో పరిష్కరించుకోవడానికి భూభారతిలో ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. భూ సమస్యలపై గతంలోలా కోర్టులను ఆశ్రయించకుండానే పరిష్కరించుకునేలా విధంగా షెడ్యూల్ (ఎ)లో పొందుపర్చినట్లు వెల్లడించారు. భూమి విలువ రూ.5 లక్షల్లోపు ఉన్నట్లయితే ఆర్డీఓ స్థాయి, రూ.5లక్షల పైగా ఉంటే కలెక్టర్ స్థాయి అధికారులు సమస్యను పరిష్కరించేలా అవకాశం కల్పించారని తెలిపారు. భూమి విషయంలో దరఖాస్తు చేసుకున్న రోజు నుంచి సంవత్సరంలోపు సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కలెక్టర్ స్థాయిలో సమస్య పరిష్కారం కానట్లయితే సీసీఎల్ఏ కు ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. ప్రస్తుతం మండల తహసిల్దార్లు, సబ్ రిజిస్టర్ అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారని, ఇకనుంచి అన్నీ పరిశీలించిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. గతంలో ధరణిలో కొన్ని లోపాలుండడం వల్ల భూ సమస్యలు పరిష్కారం కాలేదని, ఇప్పుడు ప్రభుత్వం రూపొందించిన భూభారతిలో వాటిని సరిచేసిందన్నారు. భూభారతిలో రెవెన్యూ రికార్డులను సక్రమంగా మెయింటైన్ చేస్తారని, ప్రతి సంవత్సరం భూముల రికార్డులు తీసి, ఆ ఫైళ్లను తహసిల్దార్ కార్యాలయంలో భద్రపరు స్తామన్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న భూభారతిలో ఎలాంటి లోపాలున్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. భూమికి సంబంధించి ఏదైనా తప్పు జరిగితే సంబంధిత తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లవచ్చని అక్కడ పరిష్కారం కాకపోతే ఆర్డీఓకు అప్పీలు చేసుకోవచ్చని అక్కడ కూడా న్యాయం జరగకపోతే కలెక్టరుకు అప్పీలు చేసు కునే అవకాశం భూభారతిలో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు భూభారతి పోర్టల్లో ఉన్న అంశాలపై అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సులో కొత్తగూడెం ఆర్డీఓ మధు, గుండాల తహసిల్దార్ ఇమాన్యుయేల్ , ఎంపీడీఓ సత్యనారాయణ, రైతులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

