రాష్ట్రపతిభవన్ లో భద్రాద్రి గిరిజన మహిళల స్టాల్స్

✍️ భద్రాచలం – దివిటీ (మార్చి 5)
గిరిజన మహిళలు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ద్వారా తయారు చేసే వివిధ రకాల సబ్బులు షాంపూలు, మిల్లెట్ బిస్కెట్స్, కరక్కాయపౌడర్, తేనె, న్యూట్రి మిక్స్ ఉత్పత్తులు (గిరిజనులకు సంబంధించిన ప్రొడక్ట్స్) ప్రాచుర్యంలోకి తేవడానికి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ లో గిరిజన మహిళల ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేసిన సమాచారం అందుకున్న సందర్భంగా భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ బుధవారం మాట్లాడారు. ఇండియా సాంస్కృతిక వైవిధ్యం – సౌత్ ఆఫ్ ఇండియా నేపథ్యంలో భాగంగా మినిస్టర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సహకారంతో గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఆదివాసీ గిరిజన మహిళలకు చెందిన వివిధ రకాల ఉత్పత్తులతో ఆ స్టాల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సహజమైన ఉత్పత్తుల వల్ల కలిగే ప్రయోజనాలు ఇతర రాష్ట్రాల ప్రతినిధులకు, ప్రజలకు తెలియజేసి ప్రాచుర్యంలోకి తేవడం కోసం ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. భద్రాచలం ఐటీడీఏ నుంచి మూడు ఎంఎస్ఎంఈ యూనిట్లకు సంబంధించిన సిబ్బందిని వారు తయారు చేస్తున్న ఉత్పత్తులతో పాటు పంపించామన్నారు. ఈనెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గిరిజన మహిళలు తయారుచేసిన వివిధ రకాల ఉత్పత్తులను అమ్మకాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రోగ్రాంలో మన రాష్ట్రం నుంచే కాక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు స్టాల్స్ ఏర్పాటు చేసి వారి ఉత్పత్తులను అమ్ముకుంటున్నారని అన్నారు. భద్రాచలం ఐటీడీఏ తరపున శ్రీలక్ష్మి గణపతి, భద్రాద్రి శ్రీరామ, దమ్మక్క జాయింట్ లయబిలిటీ గ్రూపుల ఎంఎస్ ఎంఈ యూనిట్ల మహిళలను పంపించి, రాష్ట్రపతిభవన్ లో స్టాల్స్ ఏర్పాటు చేయించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, వెంకటలక్ష్మి, రమాదేవి, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.