ఐటీసీ ఎన్నికల్లో భారీమెజార్టీతో ఐఎన్టీయూసీ విజయం తథ్యం
నేడు భారీఎత్తున జనరల్ బాడీ సమావేశం
ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి
✍️ బూర్గంపాడు – దివిటీ (జనవరి 28)
ఐటీసీ పేపర్ పరిశ్రమలో ఈ నెల 31న జరుగనున్న గుర్తింపు కార్మికసంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ భారీమెజారిటీతో విజయం సాధించటం తధ్యమని ఐటీసీ ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి అన్నారు. సారపాకలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఐఎన్టీయూసీ భారీమెజార్టీపై కన్నేసిందని అన్నారు. ఇప్పటికే కొన్ని ప్రధాన కార్మిక సంఘాల మద్దతుతోపాటు మరికొన్ని వర్గాల మద్దతు సంపాదించిన ఐఎన్టీటీయూసీకి 13వ వేతన ఒప్పందం సమయంలోని టీఎన్టీయూసీ కార్యవర్గంలో పనిచేసిన కొందరు ముఖ్య నాయకులు కూడా మద్దతు తెలిపారని ఆయన పేర్కొన్నారు. కార్మికవర్గాల్లో ఇప్పుడు ముఖ్యంగా ఐఎన్టీయూసీ మెజారిటీపైనే చర్చ జరుగుతుందని,
టీఎన్టీయూసీ చేసిన 13వ వేతన ఒప్పందమే ఐఎన్టీయూసీ, మిత్రపక్షాలకు విజయానికి బాటలు వేసిందన్నారు. అగ్రిమెంట్ లో ప్యాకేజీతోపాటు కార్మికులకు ప్రమోషన్స్ రాకుండా టీఎన్టీయూసీ దారుణంగా ఒప్పందం చేసిందని ఆయన ఆరోపించారు. కార్మికులకు జీవితకాలం ఎంతో నష్టాన్ని చేకూర్చిందనే విషయంపై కార్మికులు చర్చించుకుంటున్నారని ఆయన తెలిపారు. పల్ప్ ఇన్సెంటివ్ లో స్లాబులు మార్చి 1200 మంది కార్మికులకు నష్టం చేకూర్చిందన్నారు. ఐటీసీ కర్మాగారంలో ఇప్పటివరకు ఐఎన్టీయూసీ ఏడు వేతనఒప్పందాలను విజయవంతంగా చేసిందని ఆయన అన్నారు. ఈ ఒప్పందాల్లో కార్మిక సంక్షేమం, ఉద్యోగ భద్రత, మెరుగైన వేతన ఒప్పందాన్ని తీసుకువచ్చిన ఘన చరిత్ర ఐఎన్టీ యూసీకే ఉందని ఆయన అన్నారు. మెడికల్ విషయంలో ఐఎన్టీయూసీ చేసిన వేతన ఒప్పందాలే మెరుగైనవని కార్మికులు గుర్తు తెచ్చుకుం టున్నారని తెలిపారు. అదేవిధంగా మంగళవారం ఐఎన్టీయూసీ జనరల్ బాడీ సమా వేశం భారీస్థాయిలో ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.ఈ సమావేశానికి రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ అధ్యక్షుడు గోనె రామారావు, ఐటీసీ ఐఎన్టీయూసీ చైర్మన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారం వెంకటేశ్వరరెడ్డి, ఐఎన్టీయూసీ నాయకుడు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.