‘భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి’
✍️ దివిటీ మీడియా – సారపాక
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో శనివారం సిఐటియు ఆఫీసులో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం, పెయింటర్స్ యూనియన్ సమావేశంలో సమస్యలపై చర్చించారు. సమావేశంలో భవన నిర్మాణ కార్మికసంఘం గౌరవ సలహాదారు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరకట్లేదని, ఆ కుటుంబాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నాయని తెలిపారు. అక్రమంగా ఇసుకను ఇతర జిల్లాలకు లారీలు, టిప్పర్లతో తరలిస్తున్నారే తప్ప మండలంలో ఇసుక దొరకక భవన నిర్మాణాలు చేయించే పరిస్థితి లేదన్నారు. లేబర్ ఇన్సూరెన్సులో కార్మికులకు రావలసిన పరిహారాలు, సాయం కూడా సకాలంలో రాకుండా అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చిన్నచిన్న వాటిని కూడా పరిష్కరించకుండా కార్మికులకు ఇన్సూరెన్స్ డబ్బులు రాకుండా దూరంచేస్తున్న అధికారులపై జిల్లా అధికారులు, రాష్ట్ర లేబర్ ఇన్సూరెన్స్ బోర్డు అధికారులు దృష్టి పెట్టాలని కోరారు. సమావేశంలో అధ్యక్షుడు సగేం శ్రీను, కోశాధికారి తోట మల్లయ్య, సిహెచ్ రమణయ్య, ఓర్సు పండు, బిక్యి,
నూనె వెంకన్న, అనుమ వీరన్న, తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

