జిల్లా పోలీస్ కేంద్రంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

✍️ కొత్తగూడెం – దివిటీ (డిసెంబరు 18)
హేమచంద్రపురంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ కేంద్రంలో బుధవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ముఖ్య అతిథి జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతోపాటు అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) టి.సాయి మనోహర్ పాల్గొన్నారు. ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏఆర్ అధికారులు, సిబ్బంది సమక్షంలో క్రిస్మస్ ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ, ముందుగా క్రైస్తవ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే క్రిస్మస్ మత పరమైన సాంస్కృతిక పండుగన్నారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. అన్ని మతాల ప్రజలు మతసామరస్యాన్ని పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో అన్ని పండుగలు జరుపుకోవాలన్నారు. సెమీ క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి అనందాన్ని పంచుకున్నారు. ఈ వేడుకల్లో ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్ఐలు నరసింహారావు, కృష్ణారావు, లాల్ బాబు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

