ఎన్నికల సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పించాలి: ఐటీడీఏ పీఓ
✍️ దివిటీ మీడియా – మణుగూరు (మే 5)
రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున పార్లమెంట్ ఎన్నికలలో పనిచేసే సిబ్బందికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల వసతిసౌకర్యాలు కల్పించాలని పినపాక(ఎస్టీ) అసెంబ్లీ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి,ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అధికారులను ఆదేశించారు. మణుగూరులో జిల్లాపరిషత్ హైస్కూల్ ఆవరణలో స్ట్రాంగ్ రూములు ఏర్పాటుచేసిన ప్రదేశాలను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలింగ్ స్టేషన్లకు సామగ్రి తీసుకుని వెళ్లే సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాల ఆవరణలో షామియానాలు, మంచినీటి సౌకర్యం, భోజన వసతి, మజ్జిగ ప్యాకెట్లు, సమయానుకూలంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పోలింగ్ సామాగ్రి తీసుకుని వెళ్లేటప్పుడు వారిని సంబంధిత పోలింగ్ స్టేషన్లకు చేరవేయడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పారు. పోలింగ్ సిబ్బంది ఆ సామగ్రిని సరిచూసుకోవడానికి ఇబ్బందులు కలగకుండా 11వ తేదీ సాయంత్రంలోగా పాఠశాల ఆవరణలో షామియానాలు, 1500 కుర్చీలు ఏర్పాటు చేయాలని, తహసిల్దారును ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది సామగ్రి తీసుకుని వెళ్లేటప్పుడు వారు వెళ్లే బస్సులలో మంచినీటి బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు కూడా పంపిణీ చేయాలన్నారు. ఎవరు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన స్థానాలకు వెళ్లేటప్పుడు తప్పని సరిగా భోజనాలు చేసి వెళ్లేలా భోజనాలు కూడా సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డీటీ నాగరాజు, మణుగూరు తహసిల్దార్ రాఘవరెడ్డి, తదితరులున్నారు.