లక్ష్మీపురంలో 11న సీఎం రేవంత్ రెడ్డి సభ ఖరారు
సీఎం భద్రాద్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్షించిన కలెక్టర్, ఎస్పీ

✍ దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 5
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా ఈనెల 11వ తేదీన బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో బహిరంగసభ ఖరారైంది. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల,ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ లతో కలసి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రామాలయంలో దైవ దర్శనం అనంతరం జిల్లాలోని అభివృద్ధి పనులపై రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ రివ్యూ కోసం గిరిజనభవన్ లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లక్ష్మీపురం గ్రామ సమీపంలోని ఎంపిక చేసిన సభాస్థలంలో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలన్నారు. రామాలయ దర్శనం, హెలిపాడ్ నిర్మాణం, సభాస్థలికి ఏర్పాట్లు వేగవంతం చేయాలన్నారు. సభకు వచ్చే ప్రజలకు అవసరమైన తాగునీరు, సభా ప్రాంగణంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని, అగ్నిమాపక దళం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
జిల్లాలో జరిగే అన్ని అభివృద్ధి పనుల పురోగతిపై నివేదికలు సిద్ధం చేయాలన్నారు. ధరణి, ఎల్.ఆర్.ఎస్, ప్రజాపాలన దరఖాస్తులు, అర్హుల సంఖ్య, తదితర అన్ని వివరాలపై ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గృహలక్ష్మి, గృహజ్యోతి పథకాల కోసం వచ్చిన మొత్తం దరఖాస్తులు, లబ్ధిదారుల వివరాలకు సంబంధించిన నివేదికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్య, వైద్య శాఖలకు ఇప్పటివరకు మంజూరైన నిధులు, చేపట్టిన పనులు, మన ఊరు మనబడి, జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులపై నివేదికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీరామనవమి నాటికి భద్రాచలం వద్ద నిర్మిస్తున్న రెండో వంతెన పనులు పూర్తవ్వాలని, అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాలని నేషనల్ హైవే డీఈ శైలజను కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. వేసవిలో మంచినీటి సమస్యపై ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్’ సిద్ధం చేయాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.
భద్రాచలం రామాలయం పరిధిలో ఉన్న భూముల వివరాలు, ఆలయ అభివృద్ధి కోసం చేపట్టవలసిన అభివృద్ధి పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేయాలని రామాలయ ఈవో రమాదేవిని కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల ఆదేశించారు.
బుధవారం సాయంత్రంలోగా జిల్లాలో అన్నిశాఖల అధికారులు అభివృద్ధి పనుల పురోగతిపై తమ నివేదికలు సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అటవీశాఖాధికారులు ఈ జిల్లాలో ఇప్పటివరకు ఇచ్చిన పోడుపట్టాల వివరాలతో ఓ నివేదిక అందజేయాలని డీఎఫ్ఓ కృష్ణగౌడ్ ను ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ రవీంద్రనాథ్, డీఆర్డీఓ విద్యాచందన, జిల్లా పరిపాలన అధికారి గన్యా, డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీష, డీఎస్ఓ రుక్మిణి, భద్రాచలం ఆర్టీఓ కె.దామోదర్ రావు, కొత్తగూడెం ఆర్డీఓ మధు, ఆర్ అండ్ బి ఈఈ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య, ఇరిగేషన్ ఈఈ అర్జున్, సంబంధిత శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.