రిపోర్టర్ కుటుంబానికి మధిర ప్రెస్ క్లబ్ ఆర్థిక చేయూత
✍️ దివిటీ మీడియా (మధిర)
“జర్నలిస్టులకు ఆపదొస్తే అందరం కలిసి అండగా ఉంటాం” అనే నినాదం చాటి చెప్తూ, ఇటీవల మరణించిన విలేకరి సత్యానందం కుటుంబానికి మధిర ప్రెస్ క్లబ్ ఆర్థికసాయం అందించింది. బోనకల్ విజన్ ఆంధ్ర పత్రికలో రిపోర్టర్ మంద సత్యానందం ఇటీవల రోడ్డుప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అతని స్వగ్రామం బోనకల్ మండల పరిధిలోని గోవిందాపురంలో జరిగిన ఆయన దశ దినకర్మలో మధిర ప్రెస్ క్లబ్ ప్రతినిధులు సత్యానందం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుఃఖ సమయంలో వారిని ఆదుకోవాలనే సత్సంకల్పంతో మధిర ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు నాళ్ల శ్రీనివాసరావు సూచన మేరకు అధ్యక్ష,కార్యదర్శులు జి.వి.అరుణ్ ఆధ్వర్యంలో సహాయ కోశాధికారి శ్రీధర్, ప్రచార కార్యదర్శి అర్జున్, సహాయ కార్యదర్శి వాసు ఆర్థిక సాయం సమీకరించారు. ప్రెస్ క్లబ్ మిత్రుల నుంచి రూ.12,500 సేకరించి సత్యానందం కుటుంబసభ్యులకు అంద జేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శులు బాణాల శంకరాచారి, చారుగుండ్ల నరసింహమూర్తి, కార్యవర్గ సభ్యుడు వేణు, తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

