పేకాటస్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు
✍️ దివిటీ మీడియా (ప్రకాశం)
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని బి.మాచవరం గ్రామం శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై శనివారం ఒంగోలు టాస్క్ ఫోర్స్ పోలీస్ బృందం దాడిచేశారు. ఈ సందర్భంగా ఆ ప్రదేశంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని, రూ.11,600తో పాటు 5 సెల్ ఫోన్లు, 5 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా పలు పోలీసుస్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ఒంగోలు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులుచేస్తున్నారు. అందులో భాగంగా శనివారం సాయంత్రం పేకాట స్ధావరంపై టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ సీఐ కమలాకర్ ఆధ్వర్యంలో ఎస్సై బి.వినోద్ బాబు, ఏఎస్సై షేక్ మహబూబ్ బాషా, సిబ్బంది ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదుచేసి చర్యలు చేపట్టేందుకుగాను సంతనూతలపాడు పోలీసుస్టేషన్ లో అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు ఓ ప్రకటనలో పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పరిధిలో ఎక్కడైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన ఏదైనా సమాచారముంటే, వెంటనే డయల్ 112 నంబర్కు గానీ పోలీసు వాట్సాప్ నెంబర్ 9121102266కు మెసేజ్ ద్వారా గానీ తెలియజేయాలని ప్రజలను కోరారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

