పీహెచ్సీలో ఐటీసీ మరుగుదొడ్లు, వైద్య పరికరాల ప్రారంభోత్సవం
✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)
గిరిజనులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందించేలా మారుమూల గిరిజన గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు పరికరాలు, పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపారు. దుమ్ముగూడెం మండలం నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ) లో శనివారం ఐటీసీ మిషన్ సునేహ్రాకల్ (MSK) ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లతో పాటు వైద్యపరికరాలను ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మారుమూల పి.హెచ్.సి లలో పనిచేసే వైద్య సిబ్బంది గిరిజన గ్రామాల్లో వైరల్ ఫీవర్స్ వర్షాకాలంలో ప్రబలే అవకాశం ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని 24గంటలూ అందుబాటులో ఉండి వైద్య సేవలందించాలని కోరారు. ఐటిడిఏ పీఓ బి.రాహుల్ మాట్లాడుతూ, మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాల్లో ప్రజలకోసం ఐటీసీసంస్థ విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్య, సమగ్ర కమ్యూనిటీ అభివృద్ధి రంగాల్లో సేవలందించడం ప్రశంసనీయమన్నారు. గిరిజనులకు ఆరోగ్య సేవలందించడంలో ఇటువంటి మౌలిక సదుపాయాలెంతో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో నరసాపురం సర్పంచ్ కనకరత్నం, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.శ్రీధర్, పీహెచ్సీ వైద్యాధికారి డా.శరత్, ఐటీసీ మిషన్ సునేహ్రాకల్ ప్రాజెక్ట్ మేనేజర్ జయప్రకాశ్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గీతప్రవల్లిక, హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇండియ సంస్థ ప్రతినిధులు, వైద్యసిబ్బంది, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

