తాగునీటి ఎద్దడి లేకుండా పటిష్ట కార్యాచరణ
అధికారులతో సమీక్షించిన ఖమ్మం జిల్లా కలెక్టర్
✍️ దివిటీ మీడియా (ఖమ్మం)
ఎల్నినో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఖమ్మం జిల్లాకలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన జిల్లా అధికారులతో త్రాగునీటి సరఫరా, ప్రత్యామ్నాయ పంటల అవగాహనపై అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాలవారీగా త్రాగునీటి సరఫరాపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. మిషన్ భగీరథ నీటి వనరులు, స్థానిక వనరుల లభ్యతపై స్పష్టంగా గుర్తించి, ఏ ఏ గ్రామంలో ఏ వనరులు వాడుకోవచ్చు, ఏ వనరులను రీ జనరేట్ చేసుకోవచ్చో చూడాలన్నారు. ప్రతి గ్రామం క్షేత్ర స్థాయిలో సందర్శించి నీటి వనరులను గుర్తించాలన్నారు. గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులతో అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి, ఎల్నినో పరిస్థితులు వివరించి, తాగు, సాగునీరు, విద్యుత్ పొదుపుగా వాడడంపై చైతన్యం కల్పించాలన్నారు. నీటి పొదుపుపై అవగాహన కల్పించి, తాగునీటికి మొదటి ప్రాధాన్యతివ్వాలని సూచించారు. నీటి వనరులలోని నీరు వృథా, మళ్లింపు జరగకుండా పటిష్ట నిఘా ఉంచాలన్నారు. తాగునీటిపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, వచ్చే సంవత్సరం జూన్, జూలై వరకు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, వీఓల భవనాల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో ఫామ్ పాండ్ ల పనులు గుర్తించి, సమన్వయంతో లక్ష్యం మేరకు నిర్మాణం పూర్తి చేయాలన్నారు.
ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ఎస్ఈ ఎం.వెంకటేశ్వర్లు, మిషన్ భగీరథ ఎస్ఈ శేఖర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసచారి, జిల్లా పంచాయతీఅధికారి రాంబాబు, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, మునిసిపల్ కమీషనర్లు, ఎంపీడీఓలు, తదితరులు పాల్గొన్నారు.

