మీసేవ కేంద్రాలు తనిఖీ చేసిన అధికారులు
✍️ దివిటీ – కొత్తగూడెం (నవంబరు 20)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, కొత్తగూడెం మండలాల పరిధిలోని మీసేవ కేంద్రాలను ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు, తెలంగాణ గ్రీవెన్స్ అండ్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ జిల్లా మేనేజర్ కృష్ణమూర్తి తనిఖీలు చేశారు.
మీసేవ కేంద్రాల నిర్వహణ, పరిశుభ్రత, సాంకేతిక వసతులు, సిబ్బంది ప్రవర్తన, సేవల వేగం వంటి అంశాలను వారు సమగ్రంగా పరిశీలించారు. కేంద్రాలకు వచ్చే ప్రజలు సమర్పిస్తున్న దరఖాస్తులు, ముఖ్యంగా ఆదాయ ధ్రువపత్రాలు, వృత్తి ధ్రువపత్రాలు, రేషన్ కార్డులు, జనన/మరణ ధ్రువపత్రాలు, వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు, వాటి ప్రాసెసింగ్ స్థితిని తనిఖీ చేశారు. మీసేవ ఆపరేటర్లు ప్రభుత్వం నిర్ణయించిన రుసుములు మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేశారు. సూచిక బోర్డులు, సేవల జాబితా, సేవలకు సంబంధించిన రుసుముల వివరాలు కేంద్రంలో స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. అధిక రుసుములు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పారదర్శకతతో సేవలు అందించాలనీ, ప్రతి వినియోగదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.

