జిల్లాలో పలు అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లు కొరత
అన్ని అంగన్వాడీలకు ‘గుడ్లు’ పంపిస్తున్నాం…
‘దివిటీ మీడియా’ కథనంపై స్పందించిన డీడబ్ల్యుఓ
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జూన్ 12)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో పలు అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్ల సమస్య నెలకొంది. ఈ సమస్య కారణంగా బూర్గంపాడు ప్రాజెక్టు పరిధిలో అనేక కేంద్రాల్లో ‘అమ్మమాట… అంగన్వాడీబాట…’ కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేకపోతున్న విషయంపై గురువారం ‘దివిటీ మీడియా’లో ‘అంగన్వాడీ బాట’లో ‘గుడ్లు’ తేలేస్తున్నారు.. శీర్షికతో కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ సమస్య గురించి బూర్గంపాడు సీడీపీఓ రేవతిని ‘దివిటీ మీడియా’ సంప్రదించేంథుకు ప్రయత్నించగా ఆమె స్పందించలేదు. దీంతో విషయాన్ని జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలతలెనినా దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె స్పందించారు. జిల్లా పరిధిలో ఎక్కడెక్కడ అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్లు లేవో ఆయా కేంద్రాల వివరాలు తీసుకుని శుక్రవారం లోపు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. బూర్గంపాడు ప్రాజెక్టులో ‘కోడిగుడ్ల కొరత’ గురించి తమ సిబ్బంది తన దృష్టికి తేలేదని ఆమె స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఏర్పడకుండా చూస్తానన్నారు. టెండర్ల ప్రక్రియలో సమస్య వల్ల కూడా ఈ పరిస్థితులకు కారణమని, వెంటనే గుడ్లు సరఫరా చేయాలని కాంట్రాక్టర్లకు చెప్పామని ఆమె వివరించారు. ఇదిలా ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇతర ఐసీడీఎస్ ప్రాజెక్టులలో కూడా పలు చోట్ల గుడ్లు, ఇతర ఆహార పదార్థాల సమస్య ఉందని పలువురు అంగన్వాడీ సిబ్బంది ‘దివిటీ మీడియా’ దృష్టికి తీసుకొచ్చారు. మే నెల సెలవుల తర్వాత ఈ సమస్య నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులన్నింటిలో పరిస్థితిని సమీక్షించి ఆహార పదార్థాల సరఫరా సక్రమంగా జరిగే విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.