Divitimedia
Bhadradri KothagudemBusinessHyderabadLife StyleSpot NewsTelanganaWomen

గిరిజన మహిళా సమాఖ్యలతో ఇసుక ర్యాంపులు

గిరిజన మహిళా సమాఖ్యలతో ఇసుక ర్యాంపులు

మైనింగ్ శాఖ ఎండీ భవేష్ మిశ్రా సమీక్ష

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మే 27)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పీసా యాక్ట్ ప్రకారం మహిళా సమాఖ్యలతో ఇసుక ర్యాంపుల ఏర్పాటు, నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టాలని తెలంగాణ మైనింగ్ శాఖ ఎండీ భవిష్య మిశ్రా ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో ఇసుక ర్యాపుల ఏర్పాటు, నిర్వహణకు తీసుకోవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్, భద్రాచలం, ములుగు ఐటీడీఏ పీఓలు రాహుల్, చిత్రమిశ్రాతో కలిసి టీజీఎండీసీ, ఐటీడీఏ, మైనింగ్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ జిల్లాలోని ఇసుక ర్యాంపుల వివరాలు, ప్రస్తుతం ఇసుక రాంపుల నిర్వహణలో చేపడుతున్న పద్ధతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనింగ్ శాఖ ఎండీ భవేష్ మిశ్రా మాట్లాడుతూ, ఏజెన్సీప్రాంతాల్లో గిరిజన సొసైటీలతో ఇసుకర్యాంపుల నిర్వహణ చేపట్టడం ద్వారా ఆ కుటుంబాల ఆర్థిక అభివృద్ధి, జీవనోపాధి పెంచుకోవడానికి ఎంతో తోడ్పడుతుందన్నారు. గిరిజన మహిళా సంఘాలతో ఇసుక ర్యాంపుల నిర్వహణకు అవసరమైన వాహనాలు, యంత్ర పరికరాలు ఐటీడీఏ ద్వారా సమకూర్చుతామన్నారు. దీని ద్వారా గిరిజన మహిళా సమాఖ్యలకు మూడు రెట్ల అధికాదాయం సమకూరుతుందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు ఇసుక ర్యాంపుల నిర్వహణపై ఐటీడీఏ, మైనింగ్ శాఖల అధికారులు సరైన అవగాహన కల్పించాలన్నారు. ఏర్పాటు చేసే అన్ని ఇసుక ర్యాంపులలో మహిళా సమాఖ్యలకు తోడ్పాటునందించేందుకు ఐటీడీఏ నుంచి ఒక అధికారి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8, ములుగు జిల్లాలో 3 ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రెండు వారాల్లో ఇసుక ర్యాంపుల ఏర్పాటుకు ఉత్సాహవంతులైన మహిళా సమాఖ్య సభ్యులను గుర్తించాలన్నారు. ముందు ప్రయోగాత్మకంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఒక్కొక్క ఇసుక ర్యాంపును ప్రారంభించే విధంగా వారికి శిక్షణ అందించాలని సూచించారు. గిరిజన మహిళలు సమర్థవంతంగా ఇసుక ర్యాంపులు నిర్వహించేందుకు అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఈ సమావేశంలో కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీఓలు మధు, దామోదర్ రావు, స్పెషల్ ఆఫీసర్ అశోక్ కుమార్, తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ శంకర్ నాయక్, జిల్లా మైనింగ్ ఏడీ దినేష్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఏకంగా రూ.5లక్షల లంచంతో…

Divitimedia

మణుగూరుకు రూ.83.25లక్షల సింగ‌రేణి నిధులు

Divitimedia

అక్రమార్కులకే అందలం… అభివృద్ధికి మంగళం…

Divitimedia

Leave a Comment