మణుగూరుకు రూ.83.25లక్షల సింగరేణి నిధులు
సీఎస్సార్ కింద వెచ్చించనున్న సింగరేణి
జిల్లాకలెక్టర్ ను కలిసిన సింగరేణి అధికారులు
✍️ మణుగూరు – దివిటీ (ఏప్రిల్ 25)
మణుగూరులో సి.ఎస్.ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద అభివృద్ధి పనుల కోసం సింగరేణి కాలరీస్ సంస్థ రూ.83.25లక్షలు ఖర్చు చేసేందుకు అంగీకరించింది. ఈ మేరకు సింగరేణి అధికారులు ధనసరి వెంకటేశ్వర్లు (సివిల్ అడిషనల్ జనరల్ మేనేజర్), ఎస్.రమేష్ (డెప్యూటీ జనరల్ మేనేజర్ -పర్సనల్) శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ ను ఆయన కార్యాలయంలో కలిసి పనుల వివరాలు తెలియజేశారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కట్టువాగు, మెట్లవాగు పూడికతీత పనులతోపాటు మణుగూరు మున్సిపాలిటీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముంపు తప్పించేలా అవసరమైన పనులు చేయనున్నారు. సింగరేణి కాలరీస్ సంస్థ చుట్టుపక్కల గ్రామాల్లో అందరికీ విద్య, వైద్య సాయం, ఉద్యోగ సౌకర్యాలు కల్పిస్తూ చెరువులు, కుంటల అభివృద్ధి, వ్యవసాయ మౌలిక వసతుల కల్పన తదితర సదుపాయాలు ప్రజలకు కల్పిస్తున్నందుకు సింగరేణి అధికారులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు.