ఏపీలో 51 కరువు ప్రభావిత మండలాలు ప్రకటన
37 మండలాల్లో తీవ్రం, 14 మండలాల్లో మితమైన కరువు
✍️ అమరావతి – దివిటీ (జమార్చి 31)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉత్తరాంధ్ర మినహా మించిన 6 ఉమ్మడి జిల్లాల్లోని 51 మండలాలు కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించినట్లు రెవెన్యూశాఖ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కరవు ప్రభావ కమిటీ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు సమర్పించిన నివేదికలను నిశితంగా పరిశీలించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన నివేదికలు దృష్టిలో ఉంచుకుని, వర్షపాతం లోటు, పంటలనష్టం, భూగర్భ జలాల స్థాయి, వ్యవసాయ స్థితిగతులు పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిసోడియా తెలిపారు. డ్రాట్ మేనేజ్మెంట్ మాన్యువల్ ప్రకారం, రైతులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేసవితీవ్రతను క్రమం తప్పక పర్యవేక్షిస్తోందని, అవసరమైన నిధులు, సబ్సిడీలు, సహాయక కార్యక్రమాలను అందించేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

