‘కార్మికచట్టాల్లో మార్పులతో అన్యాయం చేస్తున్న మోడీ ప్రభుత్వం‘
ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సింగు నర్సింహరావు
✍️ బూర్గంపాడు – దివిటీ (మార్చి 23)
దేశంలో కార్మికవర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక సంక్షేమ చట్టాలను 4 కోడ్ లుగా మార్పుచేసి, బీజేపీ మోడీ ప్రభుత్వం పెట్టుబడి దారులకు మేలుచేసే ప్రయత్నం మోడీ చేస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సింగు నర్సింహరావు ఆరోపించారు. ఆదివారం బూర్గంపాడు సమీప పాములేరులో జరిగిన ఫిమేకం వర్కర్స్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచి బ్రిటిష్ ప్రభుత్వంతో, అనంతరం స్వదేశీ ప్రభుత్వంతో పోరాడి కార్మికులు హక్కులు, చట్టాలు సాధించుకున్నారన్నారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్ లు మార్పుచేసి 8 గంటల పనిని 12 గంటలకు పెంచడం, పర్మినెంట్ ఉద్యోగాలు లేకుండా అవుట్ సోర్సింగ్ పనులు, కనీసవేతనం లేకుండా యాజమాన్యానికి నచ్చిన జీతం ఇచ్చేలా చట్టాలు, గ్రాట్యుటీ, పెన్షన్ లేకుండా చేస్తూ వెట్టిచాకిరీకి శ్రీకారం చుడుతున్నారన్నారు. రానున్న రోజుల్లో కార్మికుల హక్కులు, ప్రశ్నించే హక్కులు లేకుండా చేస్తున్నారన్నారు. కార్మికులు మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి
నరాటి ప్రసాద్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కడారి వెంకటేశ్వరరావు, వేల్పుల మల్లికార్జున్, బర్ల వెంకటేశ్వర్లు, గడ్డం వెంకటేశ్వర్లు, సుధాకర్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.