టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు
చర్యలు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు
✍️ హైదరాబాద్ – దివిటీ (జనవరి 29)
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరహాలో బోర్డు ఏర్పాటుకోసం చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ధర్మకర్తల మండలి ఏర్పాటు కోసం రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులు సూచించారు. ఆయన బుధవారం సాయంత్రం యాదగిరిగుట్ట ఆలయ బోర్డు నియామకపు నిబంధనలపై సమీక్ష నిర్వహించారు. తిరుమలలో మాదిరిగా యాదగిరిగుట్ట ఆలయం సమీపంలో రాజకీయాలకు తావులేకుండా చూడాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ధర్మకర్తల మండలి నియామకంతో పాటు ఆలయం తరఫున చేపట్టాల్సిన పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలపై ముసాయిదాలో పేర్కొన్న నిబంధనలకు సీఎం పలు మార్పులు సూచించారు. సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

