ఐఎన్టీయూసీ గెలుపే కార్మికులకు బలం





మంచి వేతనఒప్పందం, సంక్షేమంపై ఐఎన్టీయూసీకి అండగా ఉంటాం
ప్రభుత్వ సహకారంపై ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్యే పాయం హామీ
✍️ బూర్గంపాడు – దివిటీ (జనవరి 29)
శక్తివంతమైన, ప్రభుత్వం అండ కలిగిన కార్మికసంఘం ఐఎన్టీయూసీని ఐటీసీ గుర్తింపు కార్మికసంఘం ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపిస్తే కార్మికులకు అన్ని విధాలా మేలు కలుగుతుందని ఎమ్మెల్సీ, తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం రాత్రి సారపాకలోని ఐటీసీ మెయిన్ గేట్ వద్ద నిర్వహించిన ఐఎన్టీయూసీ, మిత్ర పక్షాల బహిరంగసభలో మాట్లాడుతూ, ప్రభుత్వం తరఫున పలు అంశాలపై స్పష్టమైన హామీలిచ్చారు. ఐఎన్టీయూసీ ఐటీసీ అధ్యక్ష, కార్యదర్శులు యారం పిచ్చిరెడ్డి. గోనె రామారావు అధ్యక్షతన జరిగిన సభలో ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ, కార్మికులకు మేలు జరగాలంటే మార్పు రావాలని, అందుకు ఐఎన్టీయూసీ గెలవాలని సూచించారు. ఐటీసీ పేపర్ కర్మాగారంలో కార్మికులకు సంక్షేమం, భద్రతలతో కూడిన మెరుగైన వేతన ఒప్పందం ఐఎన్టీయూసీతోనే సాధ్యమవుతుందన్నారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఐఎన్టీయూసీ భారీ మెజారిటీతో గెలుస్తుందని, కార్మికులకు మేలు కలిగే విధంగా ప్రభుత్వం తరఫున అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం సహకారంతో ఐఎన్టీయూసీ, మిత్రపక్షాలు 14వ వేతనఒప్పందం అత్యంత మెరుగ్గా చేస్తాయని తెలిపారు. పర్మినెంట్ కార్మిక సోదరులకు ఉద్యోగ భద్రత, సంక్షేమంతో పాటు చాలాకాలంగా పెండింగులో ఉన్న, వేలాదిమందికి సేవలందించే ‘ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం’ చేస్తామని స్పష్టం చేశారు. ఈఎస్ఐ ఆసుపత్రికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. ఈనెల 31న జరిగే ఎన్నికల్లో ఐఎన్టీయూసీ మిత్ర పక్షాలకు భారీ మెజారిటీ ఇవ్వాలన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు తాను ఎమ్మెల్యేగా కృషిచేస్తానన్నారు. ఈ బహిరంగసభలో ప్రొఫెసర్ కోదండరామ్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతోపాటు పలువురు నేతలు ఐఎన్టీయూసీ, మిత్ర పక్షాల మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఈ బహిరంగసభకు ముందు ఐఎన్టీయూసీ, మిత్రపక్షాల ఆధ్వర్యంలో మోటారుసైకిళ్ల ర్యాలీ భారీగా నిర్వహించారు. కార్యక్రమాల్లో తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పొదెం వీరయ్య, ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారం వెంకటేశ్వరరెడ్డి, తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్, సీఐఐ చిన్నతరహా పరిశ్రమల విభాగం మాజీ చైర్మన్ ఉడుముల లక్ష్మీనారాయణరెడ్డి, ఐటీసీ ఐఎన్టీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు యారం పిచ్చిరెడ్డి, గోనె రామారావు, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు విజయగాంధీ, పలువురు రాష్ట్ర, జిల్లాస్థాయి కార్మిక నాయకులు, ఐటీసీ కార్మిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.