తునికాకు వ్యాపారులు, కాంట్రాక్టర్లతో ఎస్పీ సమావేశం

✍️ కొత్తగూడెం – దివిటీ మీడియా (మే 22)
తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన తునికాకు వ్యాపారులు, కాంట్రాక్టర్లతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బుధవారం తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నిషేధిత మావోయిస్టులతో తునికాకు వ్యాపారులకు ఎదురవుతున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తునికాకు సేకరణపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీలకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని వారికి సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో తునికాకు సేకరణ కోసం తిరిగే వ్యాపారులు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. నిషేధిత సీపీఐ మావోయిస్టుల గురించి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారమందించాలని కోరారు. పరోక్షంగానైనా, ప్రత్యక్షంగానైనా నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి సహకారం అందించినట్లు తెలిస్తే, వారిపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని ఈ సందర్బంగా ఎస్పీ హెచ్చరించారు. ఆదివాసీలకు నష్టం వాటిల్లకుండా, వారి సంక్షేమం కోసం జిల్లా పోలీస్ శాఖ ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు.

