వరంగల్- ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ జాబితా విడుదల
విడుదల చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల
✍ దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 24
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వరంగల్- ఖమ్మం-నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల స్థానానికి జరగనున్న ఎన్నికలకు ముసాయిదా ఓటర్ జాబితాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో మొత్తం 36926 మంది తమ ఓటుహక్కు నమోదు చేసుకున్నారని వెల్లడించారు. వీరిలో పురుషులు 20900 మంది, స్త్రీలు 16026 మంది ఉన్నారని ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని 29 ప్రదేశాలలో 55 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్లు ముసాయిదా ఓటర్ జాబితాను పరిశీలన చేసుకుని అభ్యంతరాలుంటే తెలియజేయడానికి మార్చి 14వ తేదీ వరకు గడువుందని తెలిపారు. ఈగడువులోగా వచ్చిన అభ్యంతరాలు పరిశీలించి పరిష్కరించిన తర్వాత తుది ఓటర్ జాబితా వచ్చే ఏప్రిల్ 4వ తేదీన ప్రకటిస్తామని ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు.