క్రికెట్ అభిమానులకు ప్రపంచకప్ ‘కనులవిందు’
నేటి నుంచి 45రోజులపాటు క్రికెట్ పండుగ

నేడు తొలి మ్యాచ్ లో తలపడనున్న ఇంగ్లండ్, న్యూజిలాండ్
✍🏽 దివిటీ మీడియా – క్రీడా విభాగం
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ ‘క్రికెట్ పండగ’ నేటి(అక్టోబరు 5) నుంచి ఆరంభమవుతోంది. ఈసారి ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి భారత్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని ‘నరేంద్రమోదీ స్టేడియం’ వేదికగా గురువారం జరిగే ఆరంభ మ్యాచ్ లో గత ప్రపంచకప్ ఫైనలిస్టులు ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. భారత్ లో వివిధ నగరాల్లో 45రోజుల పాటు జరిగే మ్యాచ్ లు క్రికెట్ ప్రేమికులను అలరించ బోతున్నాయి. క్రికెట్ ప్రపంచకప్ ప్రారంభం కావడానికి ఒకరోజు ముందు అహ్మదాబాద్ లో 10 జట్ల కెప్టెన్లు కలుసుకున్నారు. ఈ టోర్నీలో భారత జట్టు తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఈ నెల (అక్టోబరు) 8వ తేదీన చెన్నైలో జరుగనుంది. ఈ టోర్నీలో ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్, పాకిస్థాన్ తొలి మ్యాచ్ ఈనెల 14న అహ్మదాబాద్ లో నరేంద్రమోదీ స్టేడియంలోనే జరగనుంది. ఈ ప్రపంచకప్ లో ఆతిథ్య భారత్, ఆస్ట్రేలియా, డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి.
ప్రపంచకప్ లో భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.

