వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి

✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం
వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, అగ్నిమాపక, విద్యుత్తు, మున్సిపల్ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని వినాయక మండపాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. వివిధ శాఖల మధ్య సమన్వయంకోసం ముందస్తుగా ఉత్సవాల నిర్వాహకులు పూర్తి వివరాలు అందించాలని, ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహించడానికి ఆ సమాచారం ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ, మండలాల స్థాయిలో వినాయక ఉత్సవాల నిర్వహణపై పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, ఉత్సవ కమిటీల సభ్యులు సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజు నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రశాంత వాతావరణంలో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించాలని చెప్పారు. మండపాలకు విద్యుత్తు సరఫరా ఏర్పాటు కోసం తప్పనిసరిగా విద్యుత్తు శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలపై విద్యుత్తు అధికారులు మండపాల్లో ఆడిట్ నిర్వహించాలని చెప్పారు. విద్యుత్తు తీగలకు తగలకుండా ఎత్తు తక్కువ ఉండే విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. మండపాల్లో మైకు ఏర్పాటు కోసం పోలీసుశాఖ అనుమతి తీసుకోవాలని చెప్పారు. మన జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి నిమజ్జనానికి విగ్రహాలు వచ్చే అవకాశం ఉన్నందున యంత్రాంగం సూచించిన ప్రాంతాల్లో మాత్రమే అత్యంత భద్రత మధ్య నిమజ్జన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకోవాలని, నిమజ్జనం చేసుకునేందుకు అవసరమైన ‘రూట్ మ్యాప్’ సిద్ధం చేయాలని చెప్పారు. నిమజ్జనం రూట్ లో అవసరమైన రోడ్డు మరమ్మతు పనులు వెంటనే చేపట్టి, పూర్తి చేయాలని అదనపు కలెక్టర్, అధికారులకు సూచించారు. వినాయక నిమజ్జనానికి వినియోగించే వాహనాలను ముందస్తుగా రవాణాశాఖ అధికారి నుంచి ధ్రువీకరణ తీసుకోవాలని చెప్పారు. ప్రతి వినాయక మండపం వద్ద అవసరమైన మేరకు బందోబస్తు ఏర్పాటు చేయాలని, నిమజ్జనం సజావుగా జరిగేవిధంగా కట్టుదిట్టమైన భద్రతవ్యవస్థ ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ఉత్సవాల సందర్భంగా భక్తిపాటలు మాత్రమే వినిపించాలని, అన్ని మతాలు, వర్గాల మనోభావాలను గౌరవించాలని చెప్పారు. అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని, గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి రెచ్చగొట్టే అంశాల జోలికి వెళ్లవద్దని,శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు. నిమజ్జనం సందర్భంగా క్రేన్లు వినియోగించాలని, నిమజ్జనం జరిగే ప్రదేశాలలో గజఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. కులమతాలకు అతీతంగా అన్నివర్గాల సహకారంతో కలిసికట్టుగా పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని చెప్పారు. భక్తులకు అందించే స్వామివారి ప్రసాదాలకు ప్లాస్టిక్ వస్తువులు వినియోగించొద్దని, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని చెప్పారు. వ్యర్థాలు వేసేందుకు ‘డస్ట్ బిన్స్’ ఏర్పాటు చేయాలని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను పూజించాలని, రసాయనాలు, ప్లాసర్ ఆఫ్ పారిస్ తో చేసే విగ్రహాలు పర్యావణానికి హానికలిగిస్తాయని వివరించారు. కాలుష్యనియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో ఉచితంగా మట్టి గణపతులు పంపిణీ చేయనున్నామని, ప్రజలందరూ మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఆర్ఓ రవీంద్రనాథ్, ఏఎస్పీ పరితోష్ పంకజ్, డీపీఓ రమాకాంత్, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, మున్సిపల్ కమిషనర్లు, గణేష్ ఉత్సవకమిటీ సభ్యులు రంగాకిరణ్, దారా రమేష్, వందనపు శ్రీధర్, జి.వెంకటేశ్వరరావు, చింతలచెరువు శ్రీనివాసరావు, జల్లారపు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.