స్కూటీపై తరలిస్తున్న గంజాయి పట్టివేత
సీలేరు నుంచి తెలంగాణ మీదుగా జగ్గయ్యపేటకు…
✍️ దివిటీ మీడియా
ఏపీ పరిధిలోని సీలేరు ప్రాంతం నుంచి తెలంగాణలోని భద్రాచలం మీదుగా ఏపీ లోని జగ్గయ్యపేటకు స్కూటీపై 15 కేజీల గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బూర్గంపాడు పోలీసులు సోమవారం పట్టుకున్నారు. బూర్గంపాడు ఎస్సై మేడ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం… ఈ పట్టుబడిన గంజాయి విలువ దాదాపు రూ.7,65,000 వరకుంటుందని ఎస్సై తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు అక్రమంగా స్కూటీపై గంజాయి తరలిస్తూ, సారపాక సెంటర్లో పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో వారి బైక్ అదుపుతప్పి పడిపోగా వెనుక కూర్చున్న వ్యక్తి పారిపోయాడు. వెంటనే పోలీసులు స్కూటీ నడిపే వ్యక్తిని పట్టుకున్నారు. ఆ వ్యక్తి జగ్గయ్యపేట మండలానికి చెందిన కన్నెగంటి ఈశ్వర్ గోపీనాథ్ గా గుర్తించిన పోలీసులు, విచారణలో పారిపోయిన వ్యక్తి గూటి నాగరాజుగా గుర్తించారు. ఆ ఇద్దరూ కలిసి తమ స్కూటీపై దాదాపు 15 కిలోల గంజాయిని జగ్గయ్యపేటకు తరలిస్తున్నట్లు ఈశ్వర్ గోపీనాథ్ ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు.

