ఓపెన్ స్కూల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలి
అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ సమీక్ష
✍️ దివిటీ మీడియా – సెప్టెంబరు 18
ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్ డి.వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 22 నుంచి 28 వరకు జిల్లాలో ఓపెన్ స్కూల్ థియరీ పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఓపెన్ స్కూల్ పరీక్షల కోసం జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 10వ తరగతి రాసే అభ్యర్థులకు చుంచుపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇంటర్ అభ్యర్థులకు బాబుక్యాంప్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షల కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పదవ తరగతి పరీక్షలకు 320మంది, ఇంటర్ పరీక్షలకు 300మంది అభ్యర్థులు హాజరు కానున్నారని వెల్లడించారు. ఈ పరీక్షలు రాసే అభ్యరులు పరీక్షలు మొదలయ్యే ముందురోజు తమ పరీక్షా కేంద్రాన్ని గుర్తించాలన్నారు. ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30గంటల నుంచి 5.30గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, ప్రతీ రోజు పరీక్షకు 1గంట ముందుగానే అభ్యర్థులు పరీక్షకేంద్రానికి చేరుకోవాలని కోరారు. అభ్యర్థులు తమ వెంట హాల్ టికెట్ తెచ్చుకోవాలని, కాలిక్యులేటర్స్, ఎలక్ట్రా నిక్ పరికరాలకు అనుమతి లేదని ఆయన తెలిపారు. ఏదైనా అదనపు సమాచారం కోసం ప్రభుత్వ పరీక్షల జిల్లా సహాయకమిషనర్. ఎస్.మాధవరావును 8919279238 నెంబర్లో సంప్రదించాలని సూచించారు. ఈ సమీక్షలో జిల్లా విద్యా శాఖాధికారి బి.నాగలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

