కలెక్టరేట్లో ప్రజావాణి రద్దు : కలెక్టర్
బూర్గంపాడులో ప్రజావాణి : తహసీల్దార్
✍️ దివిటీ మీడియా – సెప్టెంబర్ 14
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో రేపు (సోమవారం) జరగాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అత్యధిక వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కొత్తగూడెం డివిజన్లోని భూసమస్యలకు సంబంధించి కొత్తగూడెం ఆర్డీఓ ఆఫీసులో, భద్రాచలం డివిజన్లోని భూసమస్యలకు సంబంధించి భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీసులో ప్రజలు తమ దరఖాస్తులు అందజేయాలని ఆయన సూచించారు. భూసమస్యలు మినహా ఇతర సమస్యలపై దరఖాస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఇన్ వార్డ్ సెక్షన్లో అందజేసి రసీదు పొందువచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ఆ దరఖాస్తులను సంబంధిత అధికారులకు పంపిస్తారని జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ తెలిపారు.
——–‐—————
బూర్గంపాడు తహసీల్దార్ కార్యాలయంలో ‘ప్రజావాణి’
———–‐——‐—–
జిల్లాకలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం బూర్గంపాడు మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ‘ప్రజావాణి’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ ప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించబడుతుందని వెల్లడించారు. ఒకవేళ ఎప్పుడైనా సోమవారం ప్రభుత్వ సెలవు అయితే, తర్వాత పనిదినంలో ఆ ప్రజావాణి జరుపబడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే వృద్ధులు, వికలాంగులు, శిశువులతో వచ్చిన మహిళలకు ప్రాధాన్యతనిస్తూ తగిన సౌకర్యాలు కల్పించనున్నట్లు కూడా తహసీల్దార్ వెల్లడించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో మండలంలోని సంబంధిత అన్నిశాఖల అధికారులు తప్పనిసరిగా పాల్గొని, పిర్యాదులు స్వీకరించి, పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దరఖాస్తుదారుల వినతులు మండల ప్రజావాణి వెబ్ పోర్టల్లో అధికారికంగా నమోదు చేయనున్నట్లు వివరించారు. బూర్గంపాడు మండలంలోని పౌరులు తమ సమస్యల వినతులు, అభ్యర్థనలు ప్రజావాణి కార్యక్రమంలో నేరుగా వచ్చి సమర్పించి తక్షణ పరిష్కారం పొందవచ్చని తహసీల్దార్ పేర్కొన్నారు.

