ఫ్లైయాష్ ఇటుకల తయారీ పరిశీలించిన కలెక్టర్

✍️దివిటీ (మణుగూరు) ఆగస్టు 28
మణుగూరు మండలం దమ్మక్కపేట వద్ద భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) ఫ్లైయాష్ ఉపయోగించి నాణ్యమైన ఇటుకలు తయారు చేస్తున్న విధానాన్ని గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఇటుకల తయారీ విధానంపై సూచనలు చేశారు. జిల్లాలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లనిర్మాణాలు, ఉపాధిహామీ పథకం పనులలో అధిక నాణ్యమైన నిర్మాణ సామగ్రి అందించడం ప్రధాన లక్ష్యమని జిల్లాకలెక్టర్ తెలిపారు. దీనిలో ఫ్లైయాష్ వినియోగించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని, ఉత్పత్తి ప్రక్రియలో మిగిలిన ఈ వ్యర్థం సమర్థవినియోగంతో ఇటుకలు తయారు చేసి ఉపయోగించవచ్చన్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా విస్తృతంగా ఇటుకలు తయారు చేయాలని కలెక్టర్ సూచించారు. ఇసుక, సిమెంట్, ఫ్లైయాష్, మట్టి మిశ్రమాలతో ఇటుకల తయారీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరలో, నాణ్యమైన ఇటుకలు అందించవచ్చని స్పష్టం చేశారు. వీటిపై విస్తృతంగా ప్రచారం జరగడం ద్వారా జిల్లాలో పెద్దఎత్తున ఇటుకల తయారీకి దోహదమవుతుందన్నారు. దీనివల్ల లబ్ధి దారులు నేరుగా లాభపడతారని ఆయన తెలిపారు. శుక్రవారం(ఆగస్టు 30) బీటీపీఎస్లో మూడు మిషన్లతో నాణ్యమైన ఇటుకలను తయారుచేసే విధానంపై శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ లబ్ధిదారులు, సంబంధిత అధికారులు, ఔత్సాహికులు పెద్దసంఖ్యలో పాల్గొని శిక్షణ పొందాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీటీపీఎస్, పంచాయతీరాజ్, ఉపాధి హామీ, గృహనిర్మాణ సంస్థ, మండల అధికారులు పాల్గొన్నారు.