ఐటీసీలో కార్మికసంఘం ఎన్నికలు నిర్వహించాలి

కార్మిక అధికారులకు ప్రతిపక్ష ఐఎన్టీయూసీ నోటీసు
✍️ బూర్గంపాడు – దివిటీ (సెప్టెంబరు 17)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని ప్రముఖ పేపర్ పరిశ్రమ ‘ఐటీసీ – పి.ఎస్.పి.డి’లో తాజాగా గుర్తింపు కార్మికసంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ, ఆ పరిశ్రమలోని ప్రతిపక్ష ఐఎన్టీయూసీ,మిత్రపక్షాలు రాష్ట్ర కార్మికశాఖ అధికారులకు మంగళవారం నోటీసు ఇచ్చాయి. ఈ మేరకు తెలంగాణ లేబర్ కమిషనర్ కు, వరంగల్ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ద్వారా ఐఎన్టీయూసీ, మిత్రపక్షాల అధ్వర్యంలో నాయకులు వరంగల్ లో నోటీసు అందజేశారు. ప్రస్తుత గుర్తింపు కార్మికసంఘం కాలపరిమితి గత జులై 4వ తేదీనాటికే ముగియటంతో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని వారు కోరారు. పరిశ్రమలోని ప్రధాన ప్రతిపక్ష కార్మికసంఘం ఐఎన్టీయూసీ, మిత్రపక్షాలు ఎన్నికల ప్రక్రియ నిర్వహణ కోసం లెటర్ ఇవ్వటంతో ఐటీసీ పేపర్ పరిశ్రమలో మళ్లీ గుర్తింపు కార్మికసంఘం ఎన్నికలకు తెరలేచింది. లేఖ ఇచ్చిన కార్యక్రమంలో ఐఎన్టీయూసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోనె రామారావు, యారం పిచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

