Divitimedia
Bhadradri KothagudemCrime NewsEducationHealthLife StyleSpot NewsTelanganaYouth

మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

జిల్లా యాంటీ డ్రగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ జి.వి.పాటిల్

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జూన్ 17)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ కోరారు. మంగళవారం ఐడీఓసీలో నిర్వహించిన జిల్లా స్థాయి యాంటీ డ్రగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు,యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం లేకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. గంజాయి, మత్తు పదార్థాలు వినియోగించకుండా ఉండేలా కళాశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టి పెట్టాలని కూడా కోరారు. విద్యాసంస్థల్లో నిర్వహించే పేరెంట్స్ టీచర్స్ సమావేశాల్లో డ్రగ్స్, గంజాయి వినియోగం వల్లే కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించాలన్నారు. గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై యదార్థ సంఘటనల ఆధారంగా వారి భవిష్యత్తుపై ఎటువంటి ప్రభావం చూపడుతుందో వీడియోల ద్వారా జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. డ్రగ్స్, మాదకద్రవ్యాల వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలపై వైద్యాధికారులతో అవగాహన కల్పించాలన్నారు. డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలు అలవాటున్న వారిని గుర్తించి, వారిని పునరావాస కేంద్రాల ద్వారా అలవాటు మాన్పించాలన్నారు. చుట్టు పక్కల ఎవరైనా మాదకద్రవ్యాలకు అలవాటు పడినట్లు తెలిస్తే, వెంటనే సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. మాదకద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్పోస్టుల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో గంజాయితో పాటు గుడుంబా నివారణకు సైతం అవసరమైన చర్యలు కచ్చితంగా చేపట్టాలన్నారు. అటవీశాఖాధికారులు వారి పరిధిలోని అటవీ భూములను పరిశీలించి, గంజాయి సాగు కనిపిస్తే వెంటనే అక్కడి పోలీస్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. జిల్లాలోని ఆసుపత్రులు, మెడికల్ షాపుల్లో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని కలెక్టర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కు ఈ సందర్భంగా సూచించారు. చెడు అలవాట్లతో ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆలోచన విధానం, ఆలోచనాశక్తి నశిస్తాయన్నారు. భావితరాలు మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కాకుండా వారికి సమాజంలో మంచి, చెడు తెలియజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

మాదకద్రవ్యాలు వినియోగించినా, రవాణా చేసినా పీడీ యాక్ట్ నమోదు చేస్తాం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
****
మాదకద్రవ్యాలు వినియోగించినా, రవాణా చేసినా పీడి యాక్ట్ నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు 3,500 కిలోల గంజాయి సీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. జిల్లాకు ఒరిస్సా నుంచి సీలేరు మీదుగా అటవీ ప్రాంతం నుంచి గంజాయి రవాణా నియంత్రించేందుకు భద్రాచలం చెక్ పోస్ట్ ద్వారా 24 గంటలూ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి గంజాయి రవాణా అడ్డు కుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మాదకద్రవ్యాలు గుర్తించేందుకు రెండు నాక్కోటిక్ డాగ్స్ అందుబాటులోకి తీసుకువచ్చామని, తెలిపారు. దానికి గాను రాష్ట్రస్థాయిలో అవార్డు కూడా అందుకున్నామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేక పోలీస్ బృందాల ఏర్పాటుతో జిల్లాలో మాదకద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నట్లు ఎస్పీ వివరించారు. మాదక ద్రవ్యాల వినియోగం పట్ల విద్యార్థులకు, యువకులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వాటి వినియోగం వల్ల పడే శిక్షల గురించి తెలపాలని ఆయన అధికారులకు సూచించారు. పాఠశాలల్లో పొక్సో చట్టంపై అవగాహన కల్పించాలని కోరారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని అడ్డుకునేందుకు డ్రగ్ టెస్టింగ్ కిట్లను కూడా అందుబాటులోకి తేనున్నట్లు ఎస్పీ తెలిపారు. భద్రాచలంలో డీఎడిక్షన్ సెంటర్ కూడా అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ సింగ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య, ఇల్లందు డీఎస్పీ రమణమూర్తి, కొత్తగూడెం ఆర్టీఓ వెంకటరమణ, జిల్లా వైద్యశాఖాధికారి భాస్కర్ నాయక్, జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరచారి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి బాబురావు, సంబంధిత అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Related posts

కీలకమైన స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించనున్న రాష్ట్ర మంత్రి కేటీఆర్

Divitimedia

వాడవాడలా ప్రజాపాలనలో అభయహస్తం దరఖాస్తుల వెల్లువ

Divitimedia

అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Divitimedia

Leave a Comment