‘నిద్రపోయి’… నిండా ‘ముంచారు’…
ఐకేపీ ‘శ్రీనిధి కుంభకోణం’లో జరిగిందేంటి…?

అధికారుల పాత్ర పైనా అనుమానాలు
✍️ బూర్గంపాడు – దివిటీ (మే 26)
కిందిస్థాయి సిబ్బంది ఏకంగా రూ.లక్షల్లో మింగేస్తుంటే ఏమీ తెలుసుకోకుండానో, తెలిసినప్పటికీ ఏమీ పట్టించుకోకుండానో మొద్దు నిద్ర పోయిన అధికారులు డ్వాక్రా సంఘాల మహిళలు నిండా మునిగేందుకు కారకులయ్యారు. ఏకంగా రూ.అరకోటికి పైగా మహిళల కష్టార్జితం దోచుకునేందుకు అవకాశం కల్పించారు. ఒకటి, రెండు నెలలు కాదు సంవత్సరాల తరబడి నిధులు స్వాహా అవుతుంటే తమకేమీ తెలియదని బొంకుతున్నారు.
బూర్గంపాడు మండలంలో ఐకేపీ నిధుల స్వాహా వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్ర మీద కూడా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. మండలంలో దాదాపు 72 గ్రామ సమాఖ్యలుండగా, కొన్ని చోట్ల మహిళలు గ్రూపులు రద్దు చేసుకోగా ఆ సంఖ్య తగ్గిపోతోంది. ప్రస్తుతం ఇక్కడున్న మహిళా గ్రామ సమాఖ్యల్లో ఏకంగా 8 సమాఖ్యల్లో ఇంత భారీమొత్తంలో శ్రీనిధి రుణాల రికవరీ నిధులు స్వాహా కావడం అందరినీ ‘దిగ్భ్రాంతి’కి గురి చేస్తోంది. ఈ వ్యవహారం తాజాగా వెలుగు చూడగా, ఇంకా మరెన్ని అక్రమాలు, అవకతవకలు బయటకు రాకుండా ఉన్నాయోనంటూ ప్రజలు, డ్వాక్రా మహిళలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు సిబ్బందిలో ఎవరికీ సంబంధం లేకుండా మహిళలే తమ యూపీఐ అకౌంట్ల నుంచి నేరుగా చెల్లింపులు చేసుకునే ‘శ్రీనిధి రికవరీల్లో’ ఇంత భారీగా నిధులు మింగేయడం పట్ల అనుమానాస్పదంగా ఉంది. అందులోనూ ఈ స్వాహాపర్వం మూడు సంవత్సరాల క్రితం (2022-23) నుంచి అడ్డూ అదుపూ లేకుండా కొనసాగడంతో ఉన్నతాధికారుల పాత్ర కచ్చితంగా ఉండి ఉంటుందనే అనుమానాలు బలపడేలా ఉంది. నెలల తరబడి ఇంత పెద్దమొత్తం రుణాల డబ్బు రికవరీ కాకుండా ఉంటే, సిబ్బందిని ప్రశ్నించకపోవడం, దానిపైన మహిళలను కూడా అడగకపోవడం బట్టి చూస్తే సహజంగానే ఉన్నతాధికారులకు కూడా ఈ కుంభకోణంలో భాగస్వామ్యం ఉండి ఉంటుందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నెలల తరబడి స్వాహా పర్వం సాగుతోందని తెలుసుకున్నప్పటికీ ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలేమీ పకడ్బందీగా లేకపోవడం కూడా వారిపై అనుమానాలకు కారణమవుతోంది. ఈ స్వాహాపర్వం రాష్ట్రంలోనే సంచలనంగా మారిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి…