మార్చి 19లోగా రాజకీయ పార్టీలతో సమావేశాలు పూర్తిచేయాలి

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
✍️ హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మార్చి 13)
స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలలో భాగంగా మార్చి 19లోపు ఓటర్ జాబితా సవరణ, ఇతర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈఓ) సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారుల తో వీడియోకాన్ఫరెన్సులో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ జిల్లాలో ప్రతి 3 నెలలకు ఒకసారి పకడ్బందీగా అప్ డేట్ కావాలని, కొత్తగా 18సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క పౌరుడికి ఓటుహక్కు కల్పించాలన్నారు. ఓటర్ జాబితా సవరణ, బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం, తదితర అంశాల పై జిల్లా ఎన్నికల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మార్చి 19 లోపు సమావేశాల నిర్వహణ పూర్తి చేయాలని ఆదేశించారు. రాజకీయ ప్రతినిధుల సమావేశం మినిట్స్, ఇతర వివరాలను మార్చి 27లోపు ఎన్నికల కమిషన్ కు సమర్పించాలని ఆయన ఆదేశించారు.
జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో, అదే విధంగా అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా రెవెన్యూ డివిజన్ అధికారులు(ఆర్డీఓ), మండలాల్లో ఎం.ఆర్.ఓ ఆధ్వర్యంలో రాజకీయ ప్రతినిధుల సమావేశాలు నిర్వహించాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో నూతన ఓటర్ నమోదు, ఓటు బదిలీ, మరణించిన ఓటర్ల వివరాలు తొలగింపు వంటి వివిధ అంశాలకు వినియోగించే ఫారం 6, 7, 8 గురించి పూర్తిస్థాయిలో వివరించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రంగప్రసాద్, ఉద్యోగి నవీన్, తదితరులు పాల్గొన్నారు.