Divitimedia
Bhadradri KothagudemEducationHealthLife StyleSpot NewsTelanganaYouth

ఆస్తిపన్నుల వసూలుకు డప్పు కొట్టండన్న కలెక్టర్

ఆస్తిపన్నుల వసూలుకు డప్పు కొట్టండన్న కలెక్టర్

ప్రభుత్వ కార్యక్రమాలపై వీసీలో జిల్లా కలెక్టర్ సమీక్ష

ఖచ్చితంగా లక్ష్యాలు సాధించాలని ఆదేశాలు

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మార్చి 12)

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి వీడియో కాన్ఫరెన్సులో సమీక్ష చేశారు. జిల్లాలో ఈజీఎస్ అమలు తీరు, క్లస్టర్ వారీగా పనిదినాలు, చేపడుతున్న పనులు, ఆస్తిపన్ను వసూలు పురోగతి, ధరణి పెండింగ్ దరఖాస్తులు, ఎల్.ఆర్.ఎస్ పెండింగ్ దరఖాస్తులు తదితర అంశాలపై జిల్లాలోని తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, సంబంధిత అధికారులతో సమీక్షించి, సూచనలు, ఆదేశాలిచ్చారు. జిల్లాలో చేపడుతున్న ఫారం పాండ్స్, ఫీడర్ ఛానల్స్, రోడ్డు ఫార్మేషన్, ట్రంచ్, బౌండరీలు, తదితర పనులకు సంబంధించి అంశాలపై క్లస్టర్ల వారీగా సమీక్షించారు. ఈజీఎస్ కింద జిల్లాలోని ప్రతి రైతు తన వ్యవసాయ భూమిలో ఫారం పాండ్స్ కచ్చితంగా ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల వివరాల జాబితా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రైతు కచ్చితంగా ఫారం పాండ్లు ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మార్చి నెలాఖరులోగా ఉపాధిహామీ పనులన్నీ పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా గ్రామాభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేసేలా, ఈ నెల 13న జిల్లాలో అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక ఇంకుడుగుంత చొప్పున తవ్వకాలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ గా ఒక గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, రహదారుల పక్కన ఇంకుడుగుంతల నిర్మాణాలు చేపట్టాలన్నారు. చేపట్టిన నిర్మాణాలు అన్నింటినీ ‘జల సంచయ్ జన్ భగీదారి ప్రోగ్రాం’లో అప్లోడ్ చేయాలని, తద్వారా దేశంలోనే ఈ జిల్లా ఇంకుడుగుంతల నిర్మాణాల్లో మొదట నిలిచేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
—————-
ఇళ్ల ముందు డప్పు కొట్టైనా ఆస్తిపన్నులు వసూలు చేయండి : కలెక్టర్
————‐—
జిల్లాలో మార్చి 15 తేదీలోగా జిల్లాలోని అన్ని ఆస్తిపన్నుల బకాయిలు 100% వసూలు చేయాలని గ్రామ పంచాయతీ సెక్రటరీలను కలెక్టర్ ఆదేశించారు. మార్చి 15 తరువాత ఎవరైతే బకాయిలు ఇంకా చెల్లించలేదో వారి వివరాలను ఫ్లెక్సీల ద్వారా గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయాలని, లేదంటే ఆ ఇంటి ముందు డప్పులు వాయించాలని కలెక్టర్ తెలిపారు. ఆస్తిపన్నుల ద్వారానే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ధరణి ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరాలో సమస్యలను సత్వరమే పరిష్కరించి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎల్-1 జాబితాను శనివారంలోగా క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, హౌసింగ్ పీడీ శంకర్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరచారి, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాసరావు, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, నళిని, డీఎల్పీఓ సుధీర్, మండల అధికారులు పాల్గొన్నారు.

Related posts

హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్

Divitimedia

రూ.4.15కోట్ల విలువైన గంజాయి పట్టుకున్న పోలీసులు

Divitimedia

ఎన్నికల సమాచారం మీడియాకు ఎప్పటికప్పుడు అందజేయాలి

Divitimedia

Leave a Comment