సమానత్వం ఇంటి నుంచే ప్రారంభం కావాలి : కలెక్టర్







బొజ్జిగుప్పలో ఘనంగా మహిళా దినోత్సవ సంబరాలు
✍️ దుమ్ముగూడెం, భద్రాచలం – దివిటీ (మార్చి 8)
ప్రకృతి ప్రతిరూపంగా అందానికి నిర్వచనంతో ఇంటికి దీపం ఇల్లాలుగా అమృతం వర్షించే అమ్మగా, అనునయించే అక్కగా, అనురాగం పంచే చెల్లిగా, ఆత్మీయత కురిపించే భార్యగా కుటుంబానికి ఎంత సుపరిచితురాలో మహిళలకు మనదేశంలో అంత ప్రాధాన్యత ఉందని, మహిళల సమానత్వం అనేది మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ అన్నారు.
శనివారం దుమ్ముగూడెం మండలంలోని బొజ్జగుప్ప ఎకో టూరిజం స్పాట్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజంలో స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనదన్నారు. పురుషులతో సమానంగా ఏ రంగంలోనైనా తమ హక్కులను కాపాడుకోవడానికి ముందుండి ఎన్నో విజయాలు సాధించారని ఒక టీచర్ గా, డాక్టర్ గా, పోలీస్ ఆఫీసర్ గా, పైలట్ గా, రైతు కూలీగా, ఇంటి పనులు చేసే పని మనిషిగా ఇలా అన్ని హోదాల్లో కూడా సమాజంలో గుర్తింపు తెచ్చుకున్నది మహిళలేనన్నారు. భారతీయ సంస్కృతిలో స్త్రీలకు సముచిత స్థానం అందించారని, మనం నిత్యం ఆరాధించే విద్యాశక్తి, జ్ఞానశక్తి స్వరూపురాలైన అమ్మవారు కూడా స్త్రీలేనని, స్త్రీని ఒక దేవతలా చూడటం, ఆమెను జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది అనాదిగా మన రక్తంలోనే జీర్ణించిపోయిందని అన్నారు. బొజ్జిగుప్ప గ్రామంలో గిరిజనులు చాలా కష్టజీవులని టూరిజం స్పాట్ ఏర్పాటు చేయడానికి ఎంతో శ్రమించి ముందుకు వచ్చారని కితాబునిచ్చారు. శ్రీ సీతారామచంద్రస్వామి కొలువై ఉన్న భద్రాచలంలో ఎంతోమంది టూరిస్టులు వస్తూపోతూ ఉంటారని, వారికి మన ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు, గిరిజన వంటకాలు తెలిపే విధంగా ప్రయత్నం చేసి, చాలా వరకు సత్ఫలితాలు పొందామన్నారు. గ్రామాల్లో సహజంగా పండే కరక్కాయలు ఇప్పపూలు అందంగా డిజైన్ చేసి ఇతర దేశాలకు ఎగుమతిచేసి వాటి ప్రాచుర్యం తెలపడం కోసం ప్రయత్నిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే డా.తెల్లం వెంకటరావు మాట్లాడుతూ, సమానత్వం ఇంటి నుంచే ప్రారంభం కావాలని, ఇంట్లో ఆడ, మగ పిల్లలను సమానంగా చూడాలని, సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో పురోగమించేలా చేయడమే ప్రభుత్వ సంకల్పం అన్నారు. సమాజంలో పురుషులతోపాటు మహిళలకు సమాన హక్కులు కలిగి ఉండాలని, విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో మహిళల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో మహిళలు కీలక స్థానాలు అధిరోహించాలన్నారు. అమ్మాయిల చదువు ప్రతి కుటుంబానికి వెలుగునిస్తుందని, తల్లిదండ్రులు తమ కుమార్తెకు పూర్తి స్వేచ్ఛనిస్తూ మంచి విద్యనందించాలని, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ, మహిళల సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు ఉద్యోగం చేయాలంటే కుటుంబసభ్యుల ప్రోత్సాహం చాలా అవసరమని, పని చేస్తున్న ప్రదేశాలలో మహిళలకు సరైన గౌరవం, భద్రత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ కలిసి జిల్లా కలెక్టరుకు, ఎమ్మెల్యేకు సన్మానం చేశారు. మహిళా దినోత్సవం దిగ్విజయంగా నిర్వహించినందుకు మహిళలకు కృతజ్ఞతలు తెలుపుతూ, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే మహిళలను సన్మానించారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు తయారుచేసిన రాగిజావను సేవించారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ మహిళా శక్తి ఉపాధ్యక్షురాలు సుధారాణి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు, తదితరులు పాల్గొన్నారు.