ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మార్చి 3)
ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాస్థాయిలో పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన పురోగతిపై అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, పంచాయతీ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలన్నారు. పంచాయతీ, రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించాలని ఆదేశించారు. 50 దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో తక్కువసంఖ్యలో పెండింగులో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మూడు రోజుల్లో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అశ్వారావుపేట పట్టణం మున్సిపాలిటీగా మారినందున అక్కడ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి కావలసిన లాగిన్లు త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే అదనపు లాగిన్లతో అధికారులు సమన్వయంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన వారం రోజుల్లో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.