ప్రజావసరాలకోసం భూసమస్యల పరిష్కారానికి భూసర్వే

రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోడల్ గా ఉండాలి

పైలెట్ ప్రాజెక్టు కింద నియోజకవర్గానికొక గ్రామంలో భూ సర్వే

భూసర్వే ద్వారా భూమి ఆసాములకు భద్రత
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
భూసర్వే సన్నద్ధతపై రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి సమీక్ష
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జనవరి 11)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆయన ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి, ఇల్లందు, అశ్వారావుపేట, పినపాక శాసనసభ్యులు కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ తో కలిసి రెవెన్యూ అధికారులతో కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, ప్రజావసరాలకోసం భూమి గుర్తించడంలో వస్తున్న సమస్యల పరిష్కారం కోసం భూ సర్వే చేపట్టాలని తెలిపారు. అందులో సాధ్యాసాధ్యాలపై అధికారులనడిగి తెలుసుకున్నారు. కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని భూమి వివరాలను మ్యాప్ ద్వారా పరిశీలించారు. ప్రతి గ్రామంలో భూమి సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న ప్రజలకు వివిధ కారణాలవల్ల భూ సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. దీనిలో భాగంగానే గిరిజన జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో ఐదు నియోజకవర్గాలలో స్థానిక ఎమ్మెల్యేల సూచన మేరకు ప్రతి నియోజకవర్గంలో ఒక పెద్ద సర్వే నెంబర్ తీసుకుంటే అందులోనే ప్రభుత్వ, అటవీ, పట్టా భూమి ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తరతరాలుగా అనేక రాజకీయ పార్టీలు, వ్యక్తులు అధికారులు వస్తున్నప్పటికీ ఈ సమస్యలకు పరిష్కారం చూపలేదన్నారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి గాను ఈ పేదోడి ప్రభుత్వం అయిన ఇందిరమ్మ రాజ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు తగిన చర్యలు చేపడుతున్నామన్నారు. దీనిలో భాగంగా బైఫరికేషన్ చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో మంజూరు చేసినటువంటి లావణి పట్టా రికార్డులు, ప్రస్తుత రికార్డుల్లో ఉన్న భూమిని సరి చూడాలని ఆదేశించారు. దీని ద్వారా బోగస్ పట్టాలను రద్దు చేయొచ్చని అధికారులకు సూచించారు. జిల్లా లో ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది? పట్టా భూమి ఎంత?, అటవీ భూమి ఎంత?, ప్రభుత్వ భూమి ఎంతనేథి సర్వే ద్వారా తెలిపోతుందని, తద్వారా భూముల సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుందన్నారు. సర్వే చేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అదునాతన పరికరాలనుపయోగించి ఈ సర్వే ఫిబ్రవరిలోగా పూర్తిచేయాలన్నారు. భూ సర్వేకు అవసరమైన సర్వేయర్లను నియమించుకోవాలని, అదేవిధంగా భూ సర్వే ప్రక్రియ పర్యవేక్షణ కోసం ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ ను ఆదేశించారు. రాష్ట్రంలోనే భూసమస్యల పరిష్కారంలో జిల్లా మోడల్ గా నిలవాలన్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యల పరిష్కారానికి, భూ ఆసాములకు భద్రత చేకూరుతుందన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, ఉమ్మడి ఖమ్మంజిల్లా సర్వే ల్యాండ్ అండ్ రికార్డ్స్ అధికారి శ్రీనివాసులు, కొత్తగూడెం ఆర్డీఓ మధు, కొత్తగూడెం నియోజకవర్గంలోని తహసిల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు.