కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ధర్నా



సంఘీభావంగా పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జనవరి 7)
తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు కనీస వేతనంగా రూ.18వేలు ఇస్తామన్న హామీ ప్రభుత్వం అమలు చెయ్యాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. ఈ మేరకు మంగళవారం కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన అంగన్వాడీ కార్యకర్తల ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి అధిక నిధులు కేటాయించాలని, పక్కాభవనాలు, విద్యుత్తు, మరుగుదొడ్లు, తాగునీరు, ఆటబొమ్మలు, రూమ్స్ లో రంగులు ఏర్పాటుచేసి అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయాలన్నారు. ఇంటిఅద్దెలు, గ్యాస్ బిల్స్, ఇతర పెండింగ్ బిల్స్ అన్నీ చెల్లించాలన్నారు. మినీటీచర్లకు మెయిన్ టీచర్లుగా ఉద్యోగోన్నతి ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జీతం రూ.7,500 నుంచి రూ.13,650కు పెంచి అమలు పర్చకుండా, 9నెలల నుంచి మినీ టీచర్ గౌరవవేతనమే ఇస్తున్నారన్నారు. తక్షణం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను ప్రభుత్వం సానుభూతితో పరిష్కరించాలని కూనంనేని కోరారు. పెండింగ్ వేతనాలందించాలని, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఐసీడీఎస్ కు నిధులు పెంచాలని, అంగన్వాడీ సెంటర్ల అభివృద్ధికి నిధులివ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు పెంచాలని, ఖాళీగా ఉన్న ఆయా టీచర్ పోస్టులు భర్తీ చెయ్యాలని, మెనూఛార్జీలు పెరుగుతున్న ధరల ప్రకారం పెంచాలని,
ఎన్నికల డ్యూటీలు రద్దు చెయ్యాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 5జీ సెల్ ఫోన్లు ఇవ్వాలని, గ్రాట్యుటీ రూ.15 లక్షలు, పెన్షన్ సదుపాయం, బీమా రూ.15 లక్షలు, హెల్త్ కార్డులివ్వాలని,
ప్రతినెల నూనె, పప్పులు, గుడ్లు, నాణ్యమైనవి అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఈ అంశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ధర్నా వద్దకు వచ్చిన సంక్షేమాధికారి లెనినా, సమస్యలను పరిస్కారం కోసం ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు కంచెర్ల జమలయ్య, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోయేసియేషన్ జిల్లా అధ్యక్షురాలు గొనె మణి, కార్యదర్శి రెడ్డి అరుణ, నాయకులు భూక్యా లలిత, వేల్పుల మల్లికార్జన్, బండి నాగేశ్వరరావు, అన్నరపు వేంకేటేశ్వర్లు, వెంకట్రావు, నిమ్మల రాంబాబు, విజయ, వినోద, శ్రీలత, సరోజ, ఇంద్ర, నాగలక్ష్మి, సావిత్రి, సంధ్య, మాదవి, రమాదేవి, విజయలక్మి, సునీత, వరుణ్, తదితరులు పాల్గొన్నారు.