ఊరచెరువు అభివృద్ధికి తహసిల్దారును కలిసిన రోటరీబృందం
✍️ బూర్గంపాడు – దివిటీ (జనవరి 6)
బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలోని ఊరచెరువు అభివృద్ధి పనుల కోసం రోటరీక్లబ్ ప్రతినిథిబృందం సోమవారం తహసిల్దారును కలిశారు. ఆ చెరువును రూ.30 లక్షల వ్యయంతో అభివృద్ధి చేయాలని, మినీ ట్యాంక్ బండ్ గా రూపొందించాలని రోటరీక్లబ్ తాజా మాజీ గవర్నర్ డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి సంకల్పించారు. చెరువును అభివృద్ధి పరచడానికి రోటరీక్లబ్ ఆఫ్ గ్లోబల్ విజార్డ్స్ హైదరాబాద్, ఐటీసీ ఇన్ భద్రా సారపాక రోటరీ క్లబ్ లకు గవర్నర్ గా అనుమతులు మంజూరు చేశారు.
అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ ను ఇటీవల కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ రోటరీ క్లబ్ వారికి కావలసిన అనుమతులు గ్రామపంచాయతీ నుంచి ‘నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్’ మంజూరీ, తదితర ప్రభుత్వ అనుమతులను త్వరతగతిన పూర్తిచేసి ఇవ్వాలని స్థానిక తహసిల్దార్ కు ఆదేశాలిచ్చారు. అందులో భాగంగానే రోటరీ ఇంటర్నేషనల్ 3150 జిల్లా తాజా మాజీ గవర్నర్ డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి, రోటరీక్లబ్ ఆఫ్ గ్లోబల్ విసార్ట్స్ అధ్యక్షుడు నంబూరి వెంకటరాజు, ప్రాజెక్ట్ కాంటాక్ట్ రోటేరియన్ సురేన్ పోరూరి, బూర్గంపాడు తహసిల్దారును కలిశారు. అనుమతులు తరితగతిన మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నుంచి అనుమతులతో చెరువు అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని, మార్చి లోగా పనులు పూర్తి చేయాలని సంకల్పించామని ఈ సందర్భంగా రోటరీ బృందం తహసిల్దారుకు తెలియజేశారు.