ఫ్రీబస్ స్కీమ్ ఎంతపని చేసిందో చూడండి…!
స్కూలుకు డుమ్మా కొట్టి.. ఫ్రీబస్సులో బాలికల చక్కర్లు
✍️ దివిటీ మీడియా నెట్ వర్క్ (జనవరి 4)
అందివచ్చిన అవకాశాన్ని అవసరంకోసం
వినియోగించుకుంటే ఫర్వాలేదు… కానీ ఓ ముగ్గురు బాలికలు అత్యుత్సాహంతో చేసిన పని అందరినీ గాబరా పెట్టింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రీ బస్ పథకాన్ని వినియోగించుకోవాలనో? ఆ పథకం అమలు తీరుతెన్నులు ఓసారి స్వీయ అనుభవంతో తెలుసుకోవాలనో? వారు చేసినపని వారి కుటుంబసభ్యులే కాకుండా పోలీసులను కూడా పరుగులు పెట్టించింది. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థినులు స్థానిక గర్ల్స్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. గురువారం ఇళ్లనుంచి పాఠశాలకు వెళ్లిన ఆ ముగ్గురు బాలికలు తిరిగి ఇళ్లకు చేరలేదు. ఈ పరిస్థితులలో రాత్రివరకు గాలించినప్పటికీ ఏ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు గాలింపు జరుపుతుండగా, అదృశ్యమైన ముగ్గురు బాలికల ఆచూకీ లభ్యమైంది. సెల్ ఫోన్ ట్రాకింగ్ ద్వారా పట్టుకున్న పోలీసులు ఆ ముగ్గురిని తల్లిదండ్రులకప్పగించారు. ఆ ముగ్గురు స్కూలుకు డుమ్మా కొట్టి, ఫ్రీబస్ ఎక్కి చక్కర్లు కొట్టినట్లు తెలుసుకున్న ఆ కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. ఫ్రీ ఆర్టీసీబస్సులో నిజామాబాద్,జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్ వెళ్లి వచ్చినట్లుగా తెలుసుకున్నారు.