వినియోగదారుల హక్కులను కాపాడాలి
జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్

✍️ కొత్తగూడెం – దివిటీ (డిసెంబరు 24)
వినియోగదారులకు కల్పించిన హక్కులు కాపాడేందుకు అందరూ కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపుకలెక్టర్ డి.వేణుగోపాల్ కోరారు. మంగళవారం జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఐడీఓసీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వేణుగోపాల్ మాట్లాడారు. వినియోగదారుల హక్కులు కాపాడేలా 1986లో ప్రభుత్వం వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం అమలులోకి తెచ్చిందన్నారు. ఈ చట్టాన్ని 2019లో మార్పులు చేసి మరింత పటిష్టమైనదిగా రూపొందించారన్నారు. ఆకర్షణీయమైన ప్రకటనలు, రాయితీలు, ఉచితాల వంటి వాటిని చూసి మోసపోవద్దన్నారు. ఆన్ లైన్ లో తేలికగా మోసాలకు గురయ్యే వారిని హ్యాకర్లు గుర్తించి దోచేస్తారని, తగు జాగ్రతలు తీసుకోవాలని కోరారు. పాస్ వర్డ్ లను సులువుగా గుర్తించేలా పెట్టుకోవద్దని, ఓటీపీలను ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. కొనుగోలు చేసినప్పుడు వస్తువు యొక్క తయారీ తేదీ, చిరునామా, గడువు తేదీ, కస్టమర్ కేర్ నెంబర్, తదితర వివరాలను సరి చూసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. డిజిటల్ పేమెంట్లు, క్యూఆర్ కోడ్, మొబైల్ యాప్ ల ద్వారా చెల్లింపుల్లో వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు విత్తనాలు, మందులు కొనేటప్పుడు బోగస్ కంపెనీల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మోసానికి గురైనవారు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి, తమకు జరిగిన నష్టాన్ని తిరిగి పొందవచ్చని తెలిపారు. తూకాల్లో మోసపోవద్దని చెప్తూ, వస్తువు కొనుగోలులో పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వ్యాపారులు ఉపయోగించే తూనికలు, కొలతల పరికరాలకు సకాలంలో ముద్ర వేయించుకుని లైసెన్స్ తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ కోరారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ హోటళ్లు, రెస్టారెంట్లను తనిఖీ చేయాలని ఆయన ఆదేశించారు. వినియోగదారుల హక్కులు కాపాడేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, వినియోగదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారి రుక్మిణి, పౌరసరపరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు, జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి మనోహర్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరచారి, వాలంటరీ ఆర్గనైజర్స్ జూలూరి రఘురామాచారి, గుగులోతు బాలు, మహమ్మద్ రియాజ్, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.