అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు
కూలీ లైన్లో కొత్తగూడెం పోలీసుల కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్



✍️ కొత్తగూడెం – దివిటీ (నవంబరు 22)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూలీలైన్ లో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా దాదాపు 250 ఇళ్లలో సోదాలు చేశారు. సరైన పత్రాలు లేకుండా, నెంబర్ ప్లేట్లు లేని 16 వాహనాలు సీజ్ చేశారు. 11 వాహనాలకు రూ.2400 జరిమానా విధించారు. ఇద్దరు బెల్ట్ షాపు నిర్వాహకుల నుంచి దాదాపు రూ.14,000 విలువైన మద్యంసీసాలు సీజ్ చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసుల సమావేశం నిర్వహించిన కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, ప్రజలకు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారి గురించి తెలిస్తే వెంటనే పోలీసులకు వారి సమాచారం అందించాలని కోరారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషిచేస్తామని తెలిపారు. మట్కా, జూదం, బెట్టింగ్, గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారి సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో 100మంది పైగా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.