ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 3 పరీక్షలు
53.17 శాతం అభ్యర్థులు హాజరు : జిల్లా కలెక్టర్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 18)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పటిష్టమైన ఏర్పాట్ల మధ్య రెండురోజులపాటు నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షలు సోమవారం ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 39 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. కొత్తగూడెంలో 26 సెంటర్లు, పాల్వంచలో 13 సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 13478మంది అభ్యర్థులకుగాను 7166మంది హాజరు కాగా, 6312 మంది గైర్హాజరయ్యారు. 53.17 శాతం హాజరు నమోదైందని జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రకటించింది. అధికారులు. జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, పలువురు జిల్లా ఉన్నతాధికారులు ఈ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీచేసిన అనంతరం పరీక్షకేంద్రం లోపలకు అనుమతించారు. బయోమెట్రిక్ విధానం ఉండడంతో అభ్యర్థులు పరీక్షకేంద్రానికి అరగంట ముందే చేరాలనే నిబంధన అమలు చేశారు. వైద్య, పారిశుద్ధ్య, విద్యుత్ శాఖల అధికారులతోపాటు ఇతర శాఖల అధికారులు, సిబ్బంది అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ అధికారులు వివిధ ప్రాంతాల నుంచి కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలకు ప్రత్యేకంగా అభ్యర్థుల కోసం బస్సులు నడిపారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూయించారు. పోలీస్ యంత్రాంగం పరీక్షకేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ప్రతి అభ్యర్థిని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోపలకు అనుమతించారు. గ్రూప్ 3 పరీక్షల నిర్వహణకోసం అధికారులు, సిబ్బందికి జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ ఆధ్వర్యంలో రెండురోజుల శిక్షణ అందించారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుని విజయవంతంగా పూర్తి చేశారు.