రైతులకు ఇబ్బందుల్లేకుండా కొనుగోళ్లు చేయాలి
కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్
✍️ ములకలపల్లి – దివిటీ (నవంబరు 16)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని మాదారం గ్రామంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ శనివారం పరిశీలించారు. రైతుల నుంచి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం గురించి నిర్వాహకులనడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను ఆయన పరిశీలించారు. అక్కడకు ధాన్యం తీసుకువచ్చిన రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులేమైనా ఉన్నాయా? అని ఆరా తీశారు. రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని సూచించారు. అన్నిశాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిస్థాయి లక్ష్యానికి అనుగుణంగా సాఫీగా సాగేలా కృషి చేయాలన్నారు. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి, లారీలలో లోడ్ చేసి నిర్దేశిత రైస్ మిల్లులకు పంపించాలని, మిల్లుల్లో ధాన్యం అన్ లోడింగ్ వెంటవెంటనే జరిగేలా పర్యవేక్షించాలన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ అధికారి త్రినాథ్ బాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.