ఇష్టంతో చదవండి : ఎంఈఓ ప్రభుదయాళ్

✍️ కొత్తగూడెం – దివిటీ (నవంబరు 15)
రేపటి భారత పౌరులైన నేటి విద్యార్థులు కష్టంతో కాక ఇష్టంతో చదువుకోవాలని రచయిత, కొత్తగూడెం మండల విద్యాశాఖాధికారి ఎం.ప్రభుదయాల్ అన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 2వ రోజైన శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువు జీవితాల్లో వెలుగులు నింపుతుందని చెప్పారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పిల్లల్లో దాగున్న సృజనాత్మకశక్తిని వెలికితీసే విధంగా పలురకాల కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండి, పోటీతత్వంతో బహుమతులు సాధించాలని ఆయన సూచించారు. అనంతరం విద్యార్థులకు చిత్రలేఖనం, భావంతో కూడిన పద్యాల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన చిత్రాలను చూసిన ఆయన అభినందించడంతోపాటు పద్యాలు చెప్తున్న చిన్నారులను వెన్నుతట్టి ప్రోత్సహించారు. కార్యక్రమంలో గ్రంథపాలకురాలు జి.మణిమృదుల, శాఖ గ్రంథపాలకులు మధుబాబు, నాగన్న, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠకులు పాల్గొన్నారు.