వాహన ప్రమాదస్థలాల్లో దిద్దుబాటు చర్యలపై సమీక్ష
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 13)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి రోడ్డు భద్రత సమావేశం బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. వాహనాల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసు శాఖ జాయింట్ ఇన్స్పెక్షన్ ద్వారా గుర్తించిన ప్రమాదస్థలాల్లో దిద్దుబాటు చర్యల కోసం వెంటనే ఎస్టిమేట్స్ తయారు చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని రహదారులపైనున్న గుంతలు ఈ నెలాఖరులోగా పూడ్చివేయాలని ఇంజనీరింగ్ శాఖల అధికారులను ఆదేశించారు. పాఠశాల, కళాశాల విద్యార్దులకు రోడ్డు భద్రత గురించి అవగాహన సదస్సు నిర్వహించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, డీఈఓను ఆదేశించారు. సింగరేణి ఏరియాతోపాటు, జిల్లా పరిధిలో వాయు కాలుష్యం, దుమ్ము వల్ల పడుతున్న ఇబ్బంది తొలగించాలని సింగరేణి సంస్థతో పాటు ఐటీసీ అధికారులు, మైనింగ్ ఏడీని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్టీఓ సదానందం, ఈఈలు లాల్ సింగ్, వేంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, తానాజీ, నేషనల్ హైవేస్ డీఈ శైలజ, డీఎంహెచ్ఓ భాస్కర్ నాయక్, డీఈఓ వెంకటాచారి, నేషనల్ హైవేస్ ఖమ్మం ప్రతినిథులు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.