మునగసాగు రైతుల పాలిట వరం
అవగాహన సదస్సులో జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 8)
మునగసాగు రైతులకు ఒక వరమని, అధికాదాయం అందించే మునగపై దృష్టి సారించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జిల్లాల.వి.పాటిల్ తెలిపారు.
మునగసాగుపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో ఇల్లందు, టేకులపల్లి, ఆళ్లపల్లి, గుండాల, లక్ష్మిదేవిపల్లి ఎంపీడీఓలు, ఏపీఓలు, ఎంఏఓలు, ఏఈఓలు, టీఏలు, ఈసీలు, ఎఫ్ఏలు, రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ, ఎవరి పొలంలో వారు పనిచేసుకుంటూ ఉపాధిహామీ పథకం ద్వారా కూలి, మెటీరియల్ రూపంలో మనకే డబ్బులొచ్చే అద్భుతమైన అవకాశం మునగ సాగు ద్వారా ఉందని తెలిపారు. ఎకరానికి 1000 మొక్కలు నాటితే ప్రతి మొక్కకు కనీసం 150 కాయలు కాసినా, 1000 మొక్కలకు 1,50,000 కాయలు వస్తాయని, ఆ కాయలను రూపాయికి రెండు (కేజీ రూ.5) చొప్పున అమ్మినా 75 వేల రూపాయలు ఆదాయం వస్తుందని వివరించారు. అంతేకాకుండా ఎండబెట్టిన ఆకుల పొడి, ఎండిన గింజల ద్వారా వచ్చే నూనె ద్వారా రైతులకు అధికాదాయం లభిస్తుందన్నారు. రైతులకు మునగ సాగుపై అవగాహన కల్పించాలని, ప్రతి వందమంది రైతుల్లో కనీసం ఐదుగురు మునగసాగు చేపట్టేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రైతు కనీసం ఒక్క ఎకరంలోనైనా మునగ సాగు చేపట్టేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ వారంలోనే మునగసాగు కోసం సన్నద్ధం కావాలని, లేకపోతే ఈ సీజనులో అవకాశం కోల్పోతామన్నారు. ఈ సందర్భంగా అధికారులను, రైతులను మునగసాగులో వచ్చే సమస్యలను అడిగి తెలుసుకుని, వారి సందేహాలు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా రైతులు మునగసాగు లాభదాయకమని, కానీ మార్కెటింగ్ చేసేందుకు తగినరీతిలో ప్రోత్సాహం కల్పించాలని, మునగలో కలుపు తీసేందుకు సరైన యంత్రాలు అందించాలని, మునగాకు పొడి చేసేందుకు ఉపయోగించే యంత్రాలపై అవగాహన కల్పించాలని, పోడు భూముల్లో మునగ సాగు చేపట్టే రైతులకు బోర్లు వేసుకునేలా అటవీశాఖ అధికారులు అనుమతులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కలెక్టరుకు విన్నవించారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. జిల్లాలోని రైతులందరూ మునగసాగులో ఆదర్శరైతులుగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని, ఆ రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామన్నారు. రైతులందరూ మునగసాగు పట్ల అవగాహన పెంచుకుని, మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఎస్, ఇతర ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని స్వతంత్రంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి కిషోర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.