పోలీసుల త్యాగాల వల్లనే స్వేచ్ఛగా యజీవించగలుగుతున్నాం
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం


వారందరిని స్మరించుకోవడం మనందరి బాధ్యత
కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసు సైకిల్ ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (అక్టోబరు 26)
సందర్భమేదైనా నిత్యం ప్రజలకు సేవలందిస్తూ, శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడుతూ అహర్నిశలు కష్ట పడేది పోలీస్ శాఖని, పోలీసుల త్యాగాల వల్లనే మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచనల మేరకు కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ జి.వి.పాటిల్ పోలీస్ అమరవీరుల త్యాగాలు, సేవలను కొనియాడారు. దేశ సరిహద్దుల్లో పహరా కాస్తూ ఉగ్రవాదులు, విద్రోహశక్తుల నుంచి మనల్ని కాపాడుతూ ఎంతోమంది పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, ఎల్లప్పుడూ వారిని స్మరించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించు కోవాలన్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, రక్తం గడ్డకట్టే చలిలో దురాక్రమణలను అడ్డుకుని దేశం కోసం తమ ప్రాణాలనర్పించిన పోలీస్ అమరవీరులను ఎప్పటికీ మరువకూడదన్నారు. దేశ అంతర్గతభద్రతలో భాగంగా విధులు నిర్వర్తిస్తూ ప్రతి ఏడాది ఉగ్రవాదులు, సంఘవిద్రోహ శక్తుల చేతుల్లో ఎంతోమంది పోలీసులు తమప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. వారందరిని స్మరించుకుంటూ ఈనెల 21నుంచి 31వరకు సంస్మరణ కార్యక్రమాలు జరుపుకుంటున్నామని తెలియజేశారు. విధి నిర్వహణతోపాటు పోలీసు అధికారులు సిబ్బంది ధైనందిన జీవితంలో ఏదో ఒక వ్యాయామం అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ ర్యాలీ లక్ష్మీదేవిపల్లి సెంట్రల్ పార్క్ నుంచి ముర్రేడువాగు బ్రిడ్జి, గణేష్ టెంపుల్, సూపర్ బజార్, బస్టాండ్ సెంటర్, పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి రామవరం మీదుగా రుద్రంపూర్ పార్క్ వరకు సాగింది. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తోపాటు జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణగౌడ్, ఓఎస్డీ సాయిమనోహర్, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, ఎస్బీ ఇన్స్పెక్టర్స్ నాగరాజు, శ్రీనివాస్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, 1టౌన్ సీఐ కరుణాకర్, 2టౌన్ సీఐ రమేష్, 3టౌన్ సీఐ శివప్రసాద్, జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, ఆర్ఐలు రవి, సుధాకర్, కృష్ణారావు, ఎస్సైలు, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. పాల్గొన్నవారందరూ ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ దాదాపు 13 కిలోమీటర్లు సైకిల్ తొక్కి కార్యక్రమం విజయవంతం చేశారు.