విద్యార్థులలో సామర్ధ్యాలు పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్


✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (అక్టోబరు 24)
విద్యార్థుల్లో సామర్ధ్యాలు పెంచడానికి ఉపాధ్యాయులు 100 శాతం కృషి చేయాలని, అందుకోసం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు తగిన ప్రణాళికలు రచించుకుని, సమర్థవంతంగా అమలు పరచాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ సూచించారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యాశిక్షణా కేంద్రంలో మండల విద్యాశాఖాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై పూర్తి దృష్టి పెట్టి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో పనులు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడానికి కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు నిధులు విడుదల చేశామని, వీటిని పాఠశాల పరిశుభ్రత కోసం, దానికి సంబంధించిన సామాన్లు కొనుగోలుకు మాత్రమే వినియోగించాలని కోరారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ఈ పనులు నిర్వహించాలని తెలిపారు. పదవ తరగతి పరీక్షల గురించి చివరి రెండు నెలల్లో ప్రణాళికలు రచించడం కాకుండా మొదటి నుంచే ప్రణాళికాబద్ధంగా పిల్లలను చదివించి పరీక్షలకు సమాయత్తం చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. పాఠశాలల్లో ఔషధమొక్కలు, అవసరమైన ఇతరరకాల మొక్కలు ఏర్పాటు చేయడానికి ప్రధానోపాధ్యాయులు చేసిన కృషిని అభినందించారు. పాఠశాలల్లో త్వరలో పాఠశాల వ్యవసాయం అనే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని దానికి కూడా ఉపాధ్యాయులందరూ సహకరించాలని ఈ సందర్భంగా జిల్లాకలెక్టర్ కోరారు. ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకు ఇంటివద్ద రాత పనిని ప్రోత్సహించడం కోసం, అవసరమైన నోటుపుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. ఆ నోటు పుస్తకాలు ఏ విధంగా ఉపయోగించాలనే అంశం మీద జిల్లా రిసోర్స్ గ్రూప్ పనిచేసిందని, సమర్థవంతంగా వినియోగించేలా చేయడం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారుల బాధ్యతని తెలిపారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులందరూ తరగతికి సంబంధించిన మౌలిక భాష, తదితర సామర్థ్యాలు అభివృద్ధి చేసేలా జిల్లాలో మౌలిక భాష, గణిత అభివృద్ధి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ, మంచి ఫలితాలు సాధించాలని కోరారు. అందుకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు జిల్లా నుంచి తప్పనిసరిగా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరాచారి, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ మాధవరావు, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్, జిల్లా సైన్స్ అధికారి చలపతిరాజు, జిల్లాలోని మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.