తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితిష్ వి పాటిల్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 1)
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో ప్రసవించే తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించి, ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల ప్రచార పోస్టర్లను గురువారం కలెక్టరేట్ లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళా శిశు సంక్షేమశాఖ, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో తల్లిపాలతో తల్లులు, పిల్లలకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కలిగించాలని, బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ప్రారంభించేలా వివరించాలని సూచించారు. బిడ్డ మొదటి ఆరునెలల వయసు వరకు తల్లిపాలు మాత్రమే ఇప్పించడం, ఆరు నెలల తర్వాత అనుబంధ కుటుంబ ఆహారం అందించే విధానం అలవాటు చేయాలన్నారు. రెండేళ్ల వయసు వరకు, వీలైనంత ఎక్కువకాలం తల్లిపాలు ఇప్పించడం, సరైన పోషణ విధానం పాటించడంపై వివరించాలని పేర్కొన్నారు. ఆగస్టు మొదటి వారంలో నిర్వహించే ఈ అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను క్షేత్రస్థాయిలో షెడ్యూల్ ప్రకారం నిర్వహించి మెరుగైన ఫలితాలు రాబట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వేల్పుల విజేత, పోషణ అభియాన్ జిల్లా సమన్వయకర్త పొనుగోటి సంపత్, జిల్లా అసోసియేట్ బి.రాము, ప్రాజెక్ట్ స్థాయి కోఆర్డినేటర్లు రామకృష్ణ, శ్రీకాంత్, సోనీ, తదితరులు పాల్గొన్నారు.